టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతేకాదు, ఆసియా కప్ సూపర్-4 మ్యాచులు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మైదానంలో కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. తాజాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా కోహ్లీ అజేయం శతకంతో చెలరేగాడు.
ఇది కోహ్లీకి ఈ స్టేడియంలో వరుసగా నాలుగో సెంచరీ కావడం గమనార్హం. ఇక్కడ ఆడిన చివరి మూడు మ్యాచుల్లో కూడా కోహ్లీ శతకాలతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్పై చేసిన సెంచరీ కోహ్లీ కెరీర్లో 47వ వన్డే శతకం. ఇదే క్రమంలో అత్యంత వేగంగా 13 వేల వన్డే పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

కొలంబో స్టేడియం కోహ్లీకి బాగా కలిసొచ్చింది. ఇంతకుముందు కొలంబోలో కోహ్లీ ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా 128 నాటౌట్, 131, 110 నాటౌట్ స్కోర్లతో ఆకట్టుకున్నాడీ మోడ్రన్ గ్రేట్. ఇప్పుడు పాకిస్తాన్పై 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 128 సగటుతో 641 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో ఒక స్టేడియంలో వరుసగా అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్గా హషీం ఆమ్లా రికార్డును సమం చేశాడు. సెంచూరియన్లో ఆమ్లా ఈ రికార్డు నెలకొల్పాడు. ఇక శ్రీలంకతో భారత్ ఆడే మ్యాచు కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా కోహ్లీ కనుక సెంచరీ సాధిస్తే.. ఒక స్టేడియంలో వరుసగా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు.
ప్రేమదాస్ స్టేడియంలో కోహ్లీ రికార్డు చూసిన ఫ్యాన్స్ మాత్రం శ్రీలంకతో మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో కూడా కోహ్లీ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని వాళ్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం అతను ఉన్న ఫాం చూస్తే ఇది అసాధ్యంగా ఏం కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 21 ఇన్నింగ్సుల్లోనే కోహ్లీ 5 శతకాలతో రాణించాడు. ఇప్పుడు లంకపై మరో సెంచరీ బాదేందుకు రెడీ అవుతున్నాడు.