పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత జట్టు మరో కీలకమైన మ్యాచ్కు రెడీ అయింది. ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో మంగళవారం నాడు భారత్ తలపడుతోంది. భారత్, పాక్ మ్యాచ్ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
కొన్ని రోజులుగా కొలంబోలో తుఫాను చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో.. మ్యాచ్ను సోమవారం కొనసాగించారు. రిజర్వ్ డేను 147/2తో ప్రారంభించిన భారత్కు కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే స్కోరు అందించారు.

వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారనే చెప్పాలి. ఆరంభంలో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ అద్భుతమైన స్వింగ్తో పాక్ ఓపెనర్లను వణికించారు. ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి పాక్ బ్యాటింగ్ లైనప్ను తుత్తునియలు చేశాడు. దీంతో ఆ టీం కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇదిలా వుండగా భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ చెప్తోంది. కొలంబోలో మంగళవారం ఉదయం 60 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉంటుందట. ఉష్ణోగ్రత మాత్రం 28 డిగ్రీలకు చేరువలో ఉంటుందని సమాచారం.
ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఆకాశంలో మేఘాలు కొంచెం తగ్గొచ్చని తెలుస్తోంది. అయితే వర్షం పడే అవకాశం మాత్రం 60 శాతంగానే ఉండనుంది. ఇక మ్యాచ్ జరిగేకొద్దీ వర్షం పడే అవకాశాలు బాగా తగ్గిపోతాయని వాతావరణ శాఖ అంచనా. సాయంత్రం నాటికి వర్షం పడే ఛాన్సులు 43 శాతానికి తగ్గిపోతాయట. చీకటి పడిన తర్వాత వర్షం పడే అవకాశం 55 శాతానికి పెరుగుతుంది.
ఒకవేళ ఈ మ్యాచ్ కనుక వర్షం వల్ల రద్దయితే భారత్, శ్రీలంక చెరో పాయింట్ తీసుకుంటాయి. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. కాబట్టి వర్షం వల్ల మ్యాచ్ ఆగితే.. ఇక ఆగిపోయినట్లే. మళ్లీ మరుసటి రోజు కొనసాగించడం కుదరదు. ఏదేమైనా పాకిస్తాన్పై ఘనవిజయం సాధించిన భారత్.. అదే జోరును శ్రీలంకపై కూడా కొనసాగించాలని కోరుకుంటోంది.