కోహ్లీ అరుదైన రికార్డు
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ తొలిసారి ఈడెన్ గార్డెన్లో సెంచరీ చేయగా... పుజారా ఐదు రోజులు పాటు టెస్టు మ్యాచ్ ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు, ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత స్పిన్నర్లు ఓ అపప్రథను మూటగట్టుకున్నారు. సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా పేలవ ప్రదర్శన చేశారు. నిజానికి ఉపఖండం పిచ్లు స్పిన్నర్లకు స్వర్గధామాలు.
ఉపఖండం పిచ్లు స్పిన్నర్లకు అనుకూలం
అప్పటి ఎర్రాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, శ్రీనివాస్ వెంకట రాఘవన్ నుంచి నేటి అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల వరకు టెస్టుల్లో అద్భుతమైన బౌలింగ్ రికార్డులను నమోదు చేశారు. అలాంటిది స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి. కాగా, అదే సమయంలో భారత పేసర్లు కొత్త రికార్డును నమోదు చేశారు. మొత్తంగా మన పేసర్లు సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్లో 17 వికెట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత పేసర్ల రికార్డు
గతంలో భారత పేసర్లు తీసిన 16 వికెట్ల రికార్డుని తాజాగా అధిగమించారు. గతంలో మూడుసార్లు భారత పేసర్లు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్ పై చెన్నైలో(1933-34), ఢిల్లీలో పాకిస్తాన్ పై(1978-79), కోల్ కతాలో(1998-99) జరిగిన టెస్టుల్లో 16 వికెట్లను భారత పేసర్లు సాధించారు. తాజాగా ఆ రికార్డును అధిగమించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇరు జట్లకు చెందిన పేసర్లు మొత్తం 32 వికెట్లు తీశారు.
కపిల్ దేవ్ 9/83తో అద్భుత ప్రదర్శన
భారత్లో జరిగిన ఓ టెస్టులో ఫాస్ట్ బౌలర్లు తీసిన అత్యధిక వికెట్ల రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచారు. 1983-84లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన టెస్టులో ఇరు జట్లకు చెందిన పేసర్లు 33 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో భారత్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ 9/83తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 138 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వెస్టిండిస్ బౌలర్లు 19 వికెట్లు తీసుకోగా, భారత బౌలర్లు 14 వికెట్లు తీసుకున్నారు.