కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (24; 32 బంతుల్లో, 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (23; 23 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఛేదనలో భారత్కు శుభారంభం దక్కింది. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా హిట్ మ్యాన్ చెలరేగడంతో వపర్ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 33 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. అయితే 13వ ఓవర్లో మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (16; 35 బంతుల్లో, 2 ఫోర్లు) ఔటవ్వడంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. కాసేపటికే రోహిత్, సుందర్ (5; 4 బంతుల్లో, 1 ఫోర్) వరుసగా పెవిలియన్కు చేరడంతో 75/0 నుంచి భారత్ 87/3కు చేరింది.
ఆ తర్వాత కోహ్లి-శ్రేయస్, కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించారు. కానీ లంక బౌలర్లు కీలక సమయంలో పుంజుకుని భాగస్వామ్యాలకు తెరదించారు. అయితే దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూబె క్రీజులో ఉంటంతో భారత్ విజయంపై ధీమాగా ఉంది. దూబె స్కోరును సమం చేశాడు. కానీ ఆ తర్వాత అసలు ట్విస్ట్. అసలంక వరుసగా దూబె, అర్షదీప్ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని మ్యాచ్ను టై చేశాడు.
అయితే టైగా మారిన భారత్-శ్రీలంక తొలి వన్డేకు సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. ఇటీవల ముగిసిన మూడో టీ20 కూడా టైగానే మారింది. ఫలితం తేలడం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా భారత్ గెలిచింది. కానీ ఇవాళ వన్డేకు సూపర్ ఓవర్ నిర్వహించలేదు. ఎందుకంటే ఐసీసీ వన్డే రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ల్లో ఓ మ్యాచ్లో విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహించరు. ఐసీసీ టోర్నమెంట్స్, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్ వన్డే ఫార్మాట్లో జరిగితే మాత్రం సూపర్ ఓవర్లను నిర్వహిస్తారు. ఆ కారణంతో తొలి వన్డేకు సూపర్ ఓవర్ జరగలేదు.