
ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ అనంతరం ఆ జట్టుతో టీమిండియా టీ20, వన్డే సిరీస్లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు 17మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డే మ్యాచ్ల ఈ సిరీస్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. జులై 12, 14, 17 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు లండన్లో జరగనుండగా.. మూడో మ్యాచ్ మాంచెస్టర్లో జరగనుంది. ఇకపోతే ఈ వన్డేలకు ఎంపికయిన జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. వీరు చాలా రోజుల తర్వాత మళ్లీ వన్డే జట్టులోకి రాబోతున్నారు. ఐర్లాండ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పాండ్యా ఏడాది తర్వాత వన్డే జట్టులో కన్పించబోతున్నాడు. 2021జులైలో శ్రీలంకతో టీమిండియా ఆడిన జట్టులో చివరిసారిగా అతను వన్డేల్లో కన్పించాడు.
అలాగే రవీంద్రా జడేజా సైతం చాలాకాలం పాటు వన్డే జట్టుకు దూరమయ్యాడు. అతను చివరిసారి 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియా సిరీస్లో వన్డే జట్టులో ఉన్నాడు. ఇకపోతే వన్డేలకు ఎంపికైన వారిలో కొత్త ప్లేయర్ అర్ష్దీప్ సింగ్. అతను గత కొన్నేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరఫున అత్యంత కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్కు అతను ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం స్థానం పొందలేకపోయాడు. ఇక మూడు మ్యాచ్ల వన్డేల టైంలోనైనా ఇంగ్లాండ్పై టీమిండియా తరఫున అతను అరంగేట్రం చేయాలని అర్షదీప్ అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 7, 9, 10 తేదీల్లో జరగనున్న టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ జరగనుంది.
వన్డేలకు ఎంపికైన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ , ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్