కోహ్లీ ఆడతాడా?: ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన
ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ కీలక సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం గమనార్హం. అయితే ఆఫ్ఘనిస్తాన్పై అద్భుత శతకంతో మెరిసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జూలై 14 నుంచి ఇంగ్లండ్ గడ్డపై ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ ఎంపికైనప్పటికీ.. ఆయన తుది జట్టులో ఆడటం అనేది పూర్తి ఫిట్నెస్పైనే ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ.. ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. జూన్ 22న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ కీలకమైన ఫిట్నెస్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే అతను ఇంగ్లండ్ పర్యటనలో బరిలోకి దిగుతాడు.
బుమ్రా రీఎంట్రీ.. జైస్వాల్కు నిరాశ
మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టులోకి అడుగుపెడుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ వన్డే మ్యాచ్ ఆడలేదు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం బుమ్రా తిరిగి యాభై ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగుతుండటంతో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. ఇంగ్లిష్ పరిస్థితుల్లో బుమ్రా స్పెల్స్ భారత్కు కీలకం కానున్నాయి. అయితే ఈ జట్టు ఎంపికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం యశస్వి జైస్వాల్ చోటు దక్కకపోవడం. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో కేవలం 86 బంతుల్లోనే 110 పరుగులతో అజేయ సెంచరీ సాధించిన జైస్వాల్కు జట్టులో చోటు దక్కలేదు. కోహ్లీ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్, అద్భుత ప్రదర్శన చేసినా తదుపరి సిరీస్కు ఎంపిక కాకపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

భారత్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో శుభ్మన్ గిల్ సారథ్యంలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి భారీ బ్యాటింగ్ బలగం ఉంది. అలాగే స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చూసుకోనుండగా, పేస్ దళానికి హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ అండగా నిలవనున్నారు. గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్నెస్ను బట్టి), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే- 14 జూలై 2026, మధ్యాహ్నం 3:30 గంటలకు-ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్
రెండో వన్డే - 16 జూలై 2026, సాయంత్రం 5:30 గంటలకు- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
మూడో వన్డే- 19 జూలై 2026, మధ్యాహ్నం 3:30 గంటలకు- లార్డ్స్, లండన్
ఈ వన్డే సిరీస్ భారత్కు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కీలకం కానుంది. సీనియర్ల రాకతో బలోపేతమైన టీమిండియా, ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును వారి సొంత మైదానాల్లో ఢీకొట్టడం కెప్టెన్ గిల్ సేనకు పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఈ సిరీస్ ద్వారా వచ్చే ఏడాది జరిగే పెద్ద టోర్నీలకు సరైన సన్నాహాలు లభిస్తాయని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications