
హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీసేన విఫలం కావడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ రహానే స్ధానంలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ 59 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి రబాడా బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు.
ఇది అభిమానులను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పేసర్లు స్టెయిన్, రబాడా, మోర్కెల్ బౌలింగ్ను ఎదుర్కొనలేక భారత బ్యాట్స్మెన్ చేతులేత్తేశారు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన సిరీస్లో అద్భుతమైన కనబర్చడంతో వైస్ కెప్టెన్ రహానేను కాదని కోహ్లీ తుది జట్టులో రోహిత్ శర్మకు చోటు కల్పించాడు.
అయితే కెప్టెన్ కోహ్లీ... రోహిత్ శర్మపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోక్స్ పేలాయి. 'పేస్ బౌలింగ్ను ఎదుర్కొనడంలో గంటసేపు తడబడ్డా రోహిత్... నాకు తెలిసి గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ వాచ్మన్' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరో నెటిజన్ 'డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కుంటే రోహిత్ డబుల్ సెంచరీ చేసినట్టే' అని ట్వీట్ చేయగా... 'సీమర్స్ను ఎదుర్కోవాలంటే రోహిత్ ఒళ్లంతా ప్యాడ్స్ పెట్టుకోవాలి' అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.