
హైదరాబాద్: సెంచూరియన్ టెస్టులో కోహ్లీసేన ఓటమి పాలవ్వడంతో సఫారీ గడ్డపై టెస్టు సిరిస్ గెలవాలన్న 25 ఏళ్ల కల కలగానే మిగిలిపోయింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50.2 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మరో టెస్టు మిగిలుండగానే దక్షిణాఫ్రికా 2-0తో సిరిస్ను సొంతం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 35/3తో బ్యాటింగ్ ఆరంభించిన భారత త్వరగానే వికెట్లను కోల్పోయింది.
అయితే రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ (47) కాసేపు దక్షిణాఫ్రికా విజయానికి అడ్డుపడ్డాడు. దీంతో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ మరో మూడు పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుందనగా రబడ వేసిన 47.2వ బంతికి రోహిత్ శర్మ (47) పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత షమి (28), బుమ్రా (2) వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. రెండో టెస్టు అరంగేట్ర బౌలర్ లుంగి ఎంగిడి ధాటికి రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. కెరీర్లో తొలి టెస్టు ఆడిన ఎంగిడి రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు తీసుకోవడం విశేషం.
ముఖ్యంగా రెండు టెస్టుల్లో కూడా భారత బౌలర్లు మెరుగ్గా రాణించినప్పటికీ, బ్యాట్స్మెన్ విఫలం కావడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 307 పరుగులు చేయగా అందులో విరాట్ కోహ్లీ 153 పరుగులు చేస్తే, మిగతా పది మంది 142 పరుగులు చేశారు.
అలానే రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 5 పరుగులు చేయగా, మిగతా పది మంది 141 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా బ్యాట్స్మెన్ తీరుపై అటు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మీరు ఇండియానే పులులు.. విదేశాల్లో పిల్లులంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లు ఎందుకు.. ఆ శ్రీలంక, వెస్టిండీస్లతోనే సిరీస్లు ఆడండి అంటూ హేళన చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.