ఇండియా-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసు మళ్లీ మొదలైంది. గత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించింది.
కానీ ప్రపంచ టెస్టు ఫార్మాట్ విజేతగా గద అందుకోలేకపోయింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఫైనల్ చేరుకోవడం రోహిత్ సేనకు నల్లేరు మీద నడకగా సాగేలా లేదు. టాప్-4లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతోనే భారత్ మిగతా మ్యాచ్లను ఆడనుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో భారత్ (74 పాయింట్లు, 68.52 %), ఆస్ట్రేలియా (90 పాయింట్లు, 62.50 %), న్యూజిలాండ్ (36 పాయింట్లు, 50 %), బంగ్లాదేశ్ (33 పాయింట్లు, 45.33 %) టాప్-4లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్ ముగింపులోపు ఇండియా మరో పది టెస్టులు ఆడనుంది. అందులో బంగ్లాతో రెండు, కివీస్తో మూడు, ఆసీస్తో అయిదు టెస్టులు ఆడనుంది. అయితే బంగ్లాదేశ్తో సిరీస్ అంటే తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. పాకిస్థాన్ను క్లీన్ స్వీప్ చేసిన కొత్త ఉత్సాహంతో బంగ్లా ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే భారత్ కనీసం అయిదు మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అప్పుడే టీమిండియాకు మెరుగైన అవకాశాలుంటాయి. ఆరు విజయాలు సాధిస్తే దాదాపు ఫైనల్ చేరినట్లే. దాదాపు దశాబ్దం నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం కోసం ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాతో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కంగారూ గడ్డపై అడుగుపెట్టకముందే ఫైనల్ బెర్తును రోహిత్ సేన ఖరారు చేసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో బంగ్లా, కివీస్ సిరీస్ విజయం భారత్కు తప్పనిసరిగా మారింది. అయితే మిగిలిన పది టెస్టుల్లో అయిదింట్లో గెలిచి, అయిదింట్లో ఓడితే టీమిండియా విజయ శాతం 58.77గా మారుతుంది. ఇది ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేస్తుంది. మరోవైపు అనూహ్యంగా నాలుగోస్థానానికి వచ్చిన బంగ్లాదేశ్కు ఫైనల్కు చేరుకోవడానికి ఛాన్స్ ఉంది. భారత్ చేతిలో చిత్తుగా 0-2తో ఓడినా వాళ్లకు ఛాన్స్ ఉంది.
ఎలా అంటే.. బంగ్లాదేశ్ మరో ఆరు టెస్టులు ఆడనుంది. భారత్ మినహా మిగిలిన వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో చెరో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే వీటిని బంగ్లా తప్పక విజయం సాధించాలి. అప్పుడు అంతిమంగా 56.25 విజయశాతంతో డబ్ల్యూటీసీ 2023-25ను ముగిస్తుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. కాగా, మిగిలిన ఆరు టెస్టుల్లో బంగ్లా నాలుగు విజయాలు, రెండింటిని డ్రాగా ముగిస్తే బంగ్లా విజయ శాతం 60+గా సాధిస్తుంది. అప్పుడు ఫైనల్ బెర్తుకు అవకాశాలు మెరుగవుతాయి. ఇక అన్నింట్లో గెలిస్తే 72.91 శాతంతో బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది.