హైదరాబాద్: కోహ్లీ సేన చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
తొలి రెండు టెస్ట్లను నాలుగో రోజు ముగించిన కోహ్లీసేన మూడో టెస్టుని మాత్రం మూడు రోజుల్లోపే ముగించేసింది. దీంతో విదేశీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును సాధించింది. తాజా విజయంతో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా కోహ్లీసేన నిలిచింది.
భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఓవర్ నైట్ స్కోరు 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక భారత్ బౌలర్లు అశ్విన్ (68/3), షమీ (3/32) ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంక జట్టులో డిక్వెల్లా (41) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే ఆలౌటైంది. ఆనంతరం ఫాలోఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్లో ధావన్ (119), పాండ్యా (108) సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హార్దిక్ పాండ్యాకు దక్కగా సిరీస్లో రెండు సెంచరీలు సహా మొత్తం 358 పరుగులు చేసిన శిఖర్ ధావన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
రెండేళ్ల క్రితం శ్రీలంకకు విరాట్ కోహ్లీ నేతృత్వంలో తొలిసారి వచ్చిన టీమిండియా 22 ఏళ్ల తర్వాత అక్కడ టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిరీస్ క్లీన్స్వీప్తో అదే గడ్డపై విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. మూడు టెస్ట్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంతో పాటు కోహ్లీ భారీ విజయాలు సాధించడమే.
తొలి టెస్టులో 304 పరుగులతో గెలిచిన టీమిండియా రెండో టెస్తులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్లో ఈ రెండు విజయాలను తలదన్నేలా ఇన్నింగ్స్ 171 పరుగులతో గెలుపొందింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్కు ఇది వరుసగా ఎనిమిదో టెస్ట్ సిరీస్ విజయం.
ఇప్పటివరకు శ్రీలంకలో 24 టెస్టులాడిన భారత్ ఖాతాలో మొత్తం 9 విజయాలు, 7 ఓటములు, 8 డ్రాలు ఉన్నాయి. శ్రీలంకపై 3-0తో టెస్టు సిరిస్ విజయాన్ని సాధించిన కోహ్లీ సేనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.