
మెల్బోర్న్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ ఆజింక్య రహానే మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలోని హానర్స్ బోర్డులో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ (112) పరుగులతో చేసిన రహానే భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి.
ప్రతిష్టాత్మక హానర్స్ బోర్దులో ఆస్ట్రేలియా మైదాన సిబ్బంది ఆజింక్య రహానే పేరును చెక్కే వీడియో క్లిప్ను బీసీసీఐ తన ధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. 2014లో తొలిసారి రహానే పేరును హానర్స్ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్లో జింక్స్ 147 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇదే మైదానంలో 169 చేసి హానర్స్ బోర్డులో పేరు దక్కించుకున్నాడు.సచిన్ టెండ్యూలర్, వీరేందర్ సెహ్వాగ్, చేటేశ్వర్ పుజారా పేర్లు కూడా హానర్స్ బోర్డులో ఉన్నాయి. పర్యటక జట్లకు చెందిన ఆటగాళ్లు టెస్టు సెంచరీ లేదా కనీసం ఐదు వికెట్లు తీసిన వారి పేర్లను హానర్స్ బోర్డులో చేర్చుతారు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు రహానే భారత్కు మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ విజయాలే సాధించాడు. మెల్బోర్న్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం ద్వారా రహానే ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. కెప్టెన్గా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన రెండో టీమిండియా సారథిగా రహానే నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ తన తొలి మూడు టెస్టుల్లో విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలిన చేదు జ్ఞాపకం.. ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,మొహ్మద్ షమీ లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ.. ఉమేశ్ యాదవ్ మ్యాచ్ మధ్యలోనే దూరమవ్వడం వంటి ప్రతికూలతల మధ్య టీమిండియా రెండో టెస్టులో గొప్పగా పోరాడింది. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ అజింక్య రహానే శతకంతో సత్తాచాటాడు. బౌలర్లు సమష్టి ప్రదర్శన చేశారు. నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. సిడ్నీ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ప్రారంభం కానుంది.