IND vs NZ Final: ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో భారత జట్టు ట్రోఫీ కలకు న్యూజిలాండ్ మరోసారి అడ్డంకిగా నిలిచింది. ఎనిమిది జట్లు ఆడిన ఈ సిరీస్ లో భారత్పై ఒత్తిడి పెంచిన ఏకైక జట్టు న్యూజిలాండ్. భారత జట్టు మాదిరిగానే న్యూజిలాండ్ జట్టు కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తోంది. స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ పై మ్యాచ్ లు జరుగుతుండడంతో న్యూజిలాండ్ మొత్తం నలుగురు స్పిన్నర్లను ఉపయోగిస్తోంది. వారిలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు.
పీడకలగా మారిన సాంట్నర్
ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక పీడకలగా మారాడు. సాంట్నర్, బ్రేస్వెల్ తమ గత నాలుగు మ్యాచ్ ల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర కూడా స్పిన్ తో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిని కలిగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి భారత జట్టు ప్రత్యేక శిక్షణలో నిమగ్నమైంది. దీని కోసం ఐసీసీ అకాడమీ శిక్షణా కేంద్రంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయి స్పిన్ బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నలుగురు స్పిన్ బౌలర్లు.. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా భారత ఆటగాళ్లు బౌలింగ్ చేస్తున్నారు.

సాధన చేస్తున్న ఆటగాళ్లు
సాంట్నర్ లాగే జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్లు కాబట్టి వారి బౌలింగ్ లో రోహిత్ శర్మ, విరాట్, శ్రేయస్, రాహుల్ వంటి ఆటగాళ్లు ఎక్కువగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. పిచ్ పరిస్థితి ప్రకారం భారీ షాట్స్ ఆడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దానిని ఎదుర్కోవడానికి భారత జట్టు ఆటగాళ్లు సింగిల్స్ ఎలా తీసుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆటగాళ్లు భారీ షాట్లు ఆడడం, పరుగులు సాధించడంపై కూడా సాధన చేశారు.
అన్నింటికి సిద్ధమే: బ్యాటింగ్ కోచ్
దీనిపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోటక్ మాట్లాడుతూ.. ఏ పిచ్కైనా తాము సిద్ధంగా ఉంటామని అన్నారు. భారత ఆటగాళ్లు దాని కోసం శిక్షణ పొందుతున్నారని అన్నారు. పిచ్ పరుగులు సాధించడానికి అనుకూలంగా ఉంటే.. అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని.. లేకుంటే వారు సింగిల్స్ తీసుకొని మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారన్నారు. దాని కోసం ప్రాక్టీస్ కొనసాగుతోందని కోటక్ అన్నారు.