
కివీస్కే మెరుగైన అవకాశం:
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. పాక్ ఆడిన నాలుగు మ్యాచుల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ జట్లు చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సెమీస్ చేరే అవకాశం కివీస్కే మెండుగా ఉంది. న్యూజిలాండ్ తన చివరి గ్రూపు మ్యాచ్లో ఆదివారం అఫ్గానిస్థాన్తో తలపడుతుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే.. మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా కివీస్ సెమీస్కు వెళ్తుంది.

అఫ్గానిస్థాన్ గెలిస్తే:
ఒకవేళ ఆఖరి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ గెలిస్తే.. న్యూజిలాండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్ కంటే అఫ్గాన్ రన్రేట్ మెరుగ్గా ఉంది. అయితే అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మాత్రం భారత్పై ఆధారపడివుంటాయి. సూపర్-12లో ఆఖరి మ్యాచ్లో నమీబియాతో భారత్ తలపడనుంది. కివీస్ను అఫ్గాన్ ఓడించినా.. ఆ జట్టు రన్రేట్ పెద్దగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కివీస్ లాంటి పెద్ద జట్టుపై భారి విజయం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే అఫ్గాన్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న భారత్ నమీబియాతో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది.

అభిమానులు కోరుకునేది ఒక్కటే:
భారత్లో ఇప్పుడు కోట్లాది అభిమానులు కోరుకునేది ఒక్కటే. న్యూజిలాండ్పై అఫ్గానిస్థాన్ గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ను ఓడిస్తే సెమీస్ చేరేందుకు భారత్కు మార్గం సుగమం అవుతుంది. ఏదేమైనా భారత్ సెమీస్ ఆశలన్నీ కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్పైనే ఉన్నాయనడంలో ఎలాంటివో అతియాశయోక్తి లేదు. ఆదివారం గ్రూప్ 2 రేసులో నిలిచేదెవరో, ఇంటిదారి పట్టేదెవరో తేలిపోనుంది. న్యూజిలాండ్పై అఫ్గానిస్థాన్ గెలవాలని ఓ భారత జట్టు అభిమానిగా కోరుకుందాం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారథిగా ఇదే చివరి ప్రపంచకప్ అన్న విషయం తెలిసిందే. ఇక గ్రూప్ 1లో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా.. రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి.


Click it and Unblock the Notifications












