సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాభవం ఎదురైంది. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభకానున్న న్యూజిలాండ్తో మూడో టెస్టులో టీమిండియా ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. స్పిన్కు అనుకూలించే వాంఖడే పిచ్పై ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేయడానికి తుదిజట్టులో మార్పులు చేపట్టాలని నిర్ణయించుకుంది.

ఒక్క పేసర్తోనే!
పుణె వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో ఇరు జట్లలో స్పిన్నర్లే 19 వికెట్లు తీశారు. భారత పేసర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ 20 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ సాధించలేదు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్ దీప్ బౌలింగే చేయలేదు. ఆఖరి టెస్టు జరగనున్న వాంఖడే కూడా స్పిన్కు అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం ఒక్క ఫాస్ట్ బౌలర్తోనే బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాను జట్టులో కొనసాగించి ఆకాశ్ దీప్కు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బదులుగా మహ్మద్ సిరాజ్ను తుదిజట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక కొత్త బంతిని పేసర్తో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పంచుకోనున్నాడు. ఆకాశ్ దీప్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్కు తొలుత అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించింది. కానీ గజ్జల్లో గాయం కారణంగా ఆసీస్ పర్యటనకు పక్కనపెట్టిన కుల్దీప్ను మూడో జట్టులో కొనసాగిస్తే విమర్శలు వస్తాయని అక్షర్కు అవకాశం ఇవ్వనుంది. అక్షర్కు బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటే సామర్థ్యం కలదు.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్/ జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.