స్వదేశంలో టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయిన టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసిన రోహిత్ సేనలోని ఏ ఆటగాడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడట్లేదు. సూర్యకుమార్ సారథ్యంలో యువ బృందం సఫారీలతో తలపడనుంది.
శ్రీలంక పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అందుకున్నప్పటి నుంచి సూర్యకుమార్కు సారథిగా అజేయ రికార్డు ఉంది. శ్రీలంక సిరీస్ను, ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను సూర్యసేన క్లీన్ స్వీప్ చేసింది. ఇక దక్షిణాఫ్రికాపై ఓవరాల్గా భారత్కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడగా టీమిండియా 15 మ్యాచ్ల్లో, సఫారీలు 11 పోరుల్లో గెలిచాయి.

పొట్టి ఫార్మాట్లో చివరిసారి టీ20 వరల్డ్ కప్లో భారత్- దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఆ తర్వాత ఇరు జట్లు పోటీపడటం ఇదే ప్రథమం. అయితే డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20లో భారత జట్టు తుదికూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కీలక ప్లేయర్లు ఆస్ట్రేలియా పర్యటనకు, గాయాల కారణంగా దూరమవ్వడంతో అనుభవంలేని యువకుల్లో ఎవరికి చోటు దక్కుతుందని ఉత్కంఠ మొదలైంది. కాగా, కెప్టెన్ సూర్య- కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వినూత్న ప్రయోగాలకు ప్రయత్నించకుండా కోర్ టీమ్ను కొనసాగిస్తూ యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ యశ్ దయాల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. యశ్ దయాల్ను ఆర్సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 10 నెలల తర్వాత తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకోనున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్లో ఓపెనింగ్ జోడీగా హిట్ అయిన అభిషేక్-సంజు శాంసన్ ద్వయం సౌతాఫ్రికా పర్యటనలోనూ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
హార్దిక్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా తుదిజట్టులో కొనసాగనున్నారు. అయితే ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే వరుణ్ చక్రవర్తికి బదులుగా రమణ్దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అక్షర్తో రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పేస్ బాధ్యతలను అర్షదీప్, యశ్లతో పాటు హార్దిక్ మోయనున్నాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.