
ముంబై: భారత మాజీ క్రికెటర్ వసంత్ రాయ్జీ శనివారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. రాయ్జీ వయసు 100 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్లోని తన నివాసంలో నిద్రలోనే ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు రాయ్జీ కన్నుమూశారని ఆయన అల్లుడు సుదర్శన్ నానావతి తెలిపారు.
శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్జీ దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం తెలుస్తోంది. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో రాయ్జీ జన్మించారు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరపున ఆయన అరంగేట్రం చేశారు. కుడిచేతి వాటం బ్యాట్స్మన్ అయిన రాయ్జీ.. 1949-50 వరకు బరోడా, ముంబై జట్టుకు సేవలందించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆయన విశేష సేవలందించారు.
వసంత్ రాయ్జీ 1940లో ముంబై, బరోడా తరఫున తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 277 పరుగులు చేశారు. అతని కెరీర్లో అత్యధిక స్కోరు 68. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాయ్జీ తొలిసారి ముంబైకి లేదా బరోడాకు ఆడలేదు. 1939లో నాగ్పూర్ సెంట్రల్ ప్రావిన్స్ జట్టుకు ఆడారు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో ఒక పరుగు చేసారు. అనంతరం 1941లో ముంబై తరఫున అరంగేట్రం చేసారు.
వసంత్ రాయ్జీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం క్రికెట్పై అనేక రచనలు చేసి క్రికెట్ చర్రితకారుడుగా పేరు గడించారు. భారత్లో తొలి తరం క్రికెటర్లలో ఒకరుగా అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన రాయ్జీ ఇటీవల 100 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, స్టీవ్ వా కేక్ కట్ చేయించి వేడుక చేసారు. రాయ్జీ పుట్టినరోజు వేడుక వీడియోను సచిన్ ట్విట్టర్లో పంచుకున్నారు.