హైదరాబాద్ : బీసీసీఐ సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఓ రకంగా చూస్తే క్రికెట్ అభిమానులకు ఇది పండుగే. రానున్న కాలంలో కోహ్లీసేన మరిన్ని టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)తో పోలిస్తే 2019-2023 ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మూడు రెట్లు ఎక్కువగా పొట్టి క్రికెట్ ఆడనుందని సమాచారం.
158 మ్యాచ్లు
ఇంతకు ముందు ఎఫ్టీపీలో టీమిండియా 36 టెస్టులు, 73 వన్డేలు, 18 టీ20లు మొత్తం కలిపి 127 మ్యాచ్లు ఆడింది. ఇక కొత్త ఎఫ్టీపీ ప్రకారం 37 టెస్టులు, 67 వన్డేలు, 54 టీ20లు మొత్తం 158 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఐతే తీరికలేని షెడ్యూలు వల్ల ఇప్పటికే తమకు విశ్రాంతి దొరకడం లేదని సరైన సన్నద్ధత ఉండటం లేదని మొత్తుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో జనరల్బాడీ కొత్త ఎఫ్టీపీ గురించి చర్చించనుంది.
ఆదాయంతో పాటు పని ఒత్తిడి కూడా..
బీసీసీఐ ఆర్థిక నమూనాను దృష్టిలో పెట్టుకొని కొత్త ఎఫ్టీపీపై చర్చిస్తారని ఆయా వర్గాల సమాచారం. అలాగే ఆటగాళ్ల పని ఒత్తిడి గురించీ మాట్లాడతారని తెలుస్తోంది. ఆటగాళ్లు ఎక్కువ ఆర్జించాలంటే అధికంగా పని ఒత్తిడి భరించాల్సిందేనని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఐతే రొటేషన్ పద్ధతిలో పని భారాన్ని తప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే 2018-2023 ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.16,347 కోట్లు లభించాయి.
మరో 10,000 కోట్లు
వచ్చే ఏడాది కొత్త ఎఫ్టీపీ మ్యాచ్ల ప్రసార హక్కుల విక్రయం ద్వారా బోర్డు మరో 10,000 కోట్ల సంపాదనపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో టీమిండియా ఆడే టీ20 ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో టీవీ ఛానల్కు దాదాపు రూ.20 కోట్లు లభిస్తున్నాయి. బీసీసీఐ ఇక కొత్త ఎఫ్టీపీలో ఎక్కువ మ్యాచ్లకు ఆమోదం తెలిపితే ఇక డబ్బులే డబ్బులు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.