|
టీమిండియా ఓటమి ప్రభావం నారా లోకేష్..
ఎక్కడో ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో భారత క్రికెట్ జట్టు ఓటమి పాలైతే.. దాని తీవ్ర ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ పరాజయానికి కారకుడని ధ్వజమెత్తుతున్నారు అభిమానులు. నీ వల్లే కోహ్లీసేన ఓడిపోయిందని అంటూ ఆక్రోశిస్తున్నారు. తమ ఆవేదనను, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నారు. నారా లోకేష్కు తమదైన శైలిలో చురకలు అంటిస్తూ చెలరేగిపోతున్నారు ఫ్యాన్స్. ఆ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. టీమిండియా ఓటమికి, నారా లోకేష్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఎద్దేవా చేస్తున్నారు. రౌండ్-రాబిన్ లీగ్ దశలో తిరుగులేని జట్టుగా ఆవిర్భవించిన టీమిండియా.. సెమీఫైనల్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం వెనుక లోకేష్ ఉన్నాడంటూ చెణుకులు విసురుతున్నారు.
ఎలాగంటారా?
సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. టీమిండియా గెలుపు కాంక్షిస్తూ చేసిన ట్వీట్ అది. ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. ప్రపంచకప్ టైటిల్ను అందుకోవడానికి ఇక రెండు అండుగుల దూరంలో మాత్రమే ఉన్నామని చెప్పారు. న్యూజిలాండ్ మీద అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని కోరుకున్నారు. మరోసారి ప్రపంచకప్ టోర్నమెంట్ విజేతగా ఆవిర్భవించాలని సూచించారు. మ్యాచ్ ఆరంభమైన మంగళవారం ఉదయమే నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు. దీన్ని టీమిండియాకు ట్యాగ్ చేశారు.
ఇక్కడే దొరికిపోయిన లోకేష్..
టీమిండియా గెలిచి ఉంటే బహుశా నారా లోకేష్ను ఎవరూ పట్టించుకుని ఉండేవారు కాదనే అనుకోవచ్చు. ఘోరంగా ఓడిపోవడంతో ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని నారా లోకేష్ ఏ ఉద్దేశంతో చెప్పారో గానీ..దానికి భిన్నంగా టీమిండియా ఆడిందంటూ ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అత్యుత్తమ ఆటతీరు సంగతి పక్కన పెడితే.. కనీసం గల్లీస్థాయి క్రికెట్ను కూడా ఆడలేకపోయిందని, అత్యంత నాసిరకంగా ఆడిందని, దీనికి కారణం నారా లోకేష్ ట్వీట్ ఎఫెక్టేనంటూ ఆరోపిస్తున్నారు ట్విట్టరెటీస్. అందరిదీ ఐరన్ లెగ్ అయితే.. నారా లోకేష్ది ఐరన్ టంగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. టంగ్ ఎఫెక్ట్.. అంటూ సోషల్ మీడియాలో లోకేష్ను ఓ ఆట ఆడుకుంటున్నారు.