ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమిండియా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కానీ మూడు వన్డేల సిరీస్ను 0-2తో కోల్పోయింది. వన్డే ఫార్మాట్లో విజయం సాధించకుండా పర్యటనను ముగించింది. పటిష్టమైన భారత జట్టు బలహీనమైన శ్రీలంక చేతిలో ఓటమిపాలవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే లంక చేతిలో వన్డే సిరీస్ ఓటమికి గల కారణాలను టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తాజాగా వివరించాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పిచ్లపై ఎక్కువగా దృష్టిసారించడం, స్పిన్ పిచ్లో సత్తాచాటుతామనే భారత బ్యాటర్ల అతివిశ్వాసమే శ్రీలంక చేతిలో ఓటమికి కారణమయ్యాయని డస్కాటె పేర్కొన్నాడు. ఈ విషయంలో జట్టుతో కలిసి పనిచేస్తానని, స్పిన్లో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లుగా భారత ప్లేయర్ల అనే పేరును కొనసాగాలేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. అలాగే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి మాట్లాడాడు.

''ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగాటోర్ని ప్రిపరేషన్కు మూడు వన్డేలు మాత్రమే ఉన్నాయి. ఓ ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్కు మారడం, దానికి జట్టును సిద్ధం చేయడం సవాలుగా ఉంటుంది. అయితే విజయాలు సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడంపై దృష్టి సారించాం. దాని కోసం మరో 10 టెస్టులు మిగిలిఉన్నాయి. స్వదేశంలో అయిదు, ఆస్ట్రేలియాలో మరో అయిదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది ఆసక్తికరంగా సాగుతుంది''
''ఇక శ్రీలంక పర్యటనలో మా ప్రదర్శన సంతృప్తికరంగా లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్న పేస్ పిచ్లపైనే టీమిండియా ఆలోచనంతా ఉంది. అక్కడ మెరుగ్గా రాణించడంపై ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు స్పిన్ ఎదుర్కోవడం మన బలమే కదా అనే భావన జట్టులో ఉంది. అయితే ఈసారి ఫలితం అనుకూలంగా రాలేదు. దీనిపై జట్టుకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. స్పిన్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు టీమిండియా ప్లేయర్లే అనే పేరును నిలబెట్టుకునేలా కృషి చేస్తాను'' అని ర్యాన్ టెన్ డస్కాటె పేర్కొన్నాడు.