పోర్ట్ ఆఫ్ స్పెయిన్: జట్టు అవసరాల మేరకు తాను ఓపెనర్గా కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమేనని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను ఇప్పటికే 2-0తో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రపు చివరి టెస్టు మ్యాచ్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో కోహ్లీ భారత బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుతూ 'బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు మూడో స్థానంలో వస్తుంటావు..? అని చాలా మంది అడుగుతుంటారు. నేనేమీ ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని కోరుకోలేదు. జట్టు అవసరాల మేరకు ఓపెనర్గా కూడా వచ్చేందుకు నేను సిద్ధమే. ఎందుకంటే జట్టులో నియమాలు అందరికీ వర్తిస్తాయి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

కాగా, నామమాత్రమైన నాలుగో టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలని కెప్టెన్ కోహ్లీ యోచిస్తున్నాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ సొంతగడ్డపై సుదీర్ఘంగా టెస్టులు ఆడనున్న నేపథ్యంలో టాప్ ఆర్డర్ను మెరుగుపర్చుకోవాలని విరాట్ భావిస్తున్నాడు. రోహిత్ శర్మ పేలవమైన ఫాం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మూడో టెస్టులో పుజారా స్థానంలో రోహిత్ శర్మకి అవకాశమిచ్చాడు కోహ్లీ. అతను తొలి ఇన్నింగ్స్ 9, రెండో ఇన్నింగ్స్లో 41 పరుగులతో నిరాశపరిచినా.. మరో అవకాశమివ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే కోహ్లీ మూడో టెస్టులో పుజారా లేకపోవడంతో ఓ స్థానం ముందుకు రావాల్సి వచ్చింది.
కాగా, ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 7 మాత్రమే కావడం గమనార్హం. చివరి టెస్టులో కూడా మూడో స్థానంలో తను, నాలుగులో రహానె, ఐదో స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్కు వచ్చేలా కోహ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇది ఇలా ఉండగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడో స్థానంలో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నా.. టెస్టుల్లో మాత్రం విఫలమవుతుండటంతో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సెప్టెంబరు 22 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది.