హైదరాబాద్: హైదరాబాద్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు యో యో పాసై భారత జట్టులో చోటు దక్కించుకుంటే మిడిలార్డర్ సమస్య తీరినట్లే అని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఆడిన రాయుడు ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్-2018లో రాయుడు 602 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో రాయుడు ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు నిర్వహించిన యో యో టెస్టులో రాయుడు విఫలమవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో రైనాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భారత్ మిడిలార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. రెండో వన్డేలో మిడిలార్డర్ విఫమవ్వడంతోనే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. బంగర్ మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు.
'భారత జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది. జట్టులోకి అంబటి రాయుడు వస్తే ఆ సమస్య తీరుతుంది. రాయుడు జట్టులోకి రావాలంటే ముందు యో యో టెస్టు పాసవ్వాలి. అతను తప్పకుండా యో యో పాసై జట్టులోకి వస్తాడని అనుకుంటున్నా. అతడు భారత జట్టులో సభ్యుడు. అతడి కోసం జట్టులో పలు స్థానాలు ఎదురుచూస్తున్నాయి' అని బంగర్ అన్నాడు.
అంతేగాక, టీమిండియా జట్టులో అడుగు పెట్టేందుకు రాయుడుకు ఇప్పటికీ అవకాశముందని తెలిపాడు. 'జట్టు ఎంపికకు ఆటగాళ్ళ అందుబాటు, ఫిట్నెస్ చూస్తాం. మిడిలార్డర్లో రాయుడు అద్భుతంగా ఆడగలడు. దురదృష్టవశాత్తు అతను యోయో పరీక్షలో విఫలమయ్యాడు. ఫిట్నెస్ పరీక్ష పాసైతే రాయుడు తప్పకుండా జట్టులోకి రావొచ్చు. చాలా స్థానాలకు ఎవరినైనా తీసుకోవచ్చు' అని బంగర్ తెలిపాడు.