దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ర్యాంకింగ్స్లో టీమిండియాకు మూడు ఫార్మాట్లకు అనుగుణంగా మూడు ర్యాంక్లు లభించాయి. టెస్ట్ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన.. టీ20ల్లో రెండో ర్యాంకును నెలబెట్టుకుంది. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. సోమవారం ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్ను విడుదుల చేసింది. టెస్టు ఫార్మాట్లో భారత్ 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ 118, ఆస్ట్రేలియా 113 పాయింట్లతో రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
మరోవైపు టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ 277 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా 272 పాయింట్లతో రెండో స్థానం, 263 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఇంగ్లండ్పై 2-3తో సిరీస్ గెలవడం టీమిండియా ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది.
ఇక పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న ఇంగ్లీష్ టీమ్కు ఆస్ట్రేలియా 2-1తో, సౌతాఫ్రికాపై 3-0తో సిరీస్ గెలవడం కలిసొచ్చింది. వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్పై సిరీస్లు నెగ్గిన న్యూజిలాండ్.. ఐదో ప్లేస్ నుంచి మూడో ర్యాంకుకు ఎగబాకింది. శ్రీలంక, బంగ్లా 8, 9వ ర్యాంకుల్లో నిలవగా... విండీస్ పదో ర్యాంక్కు పడింది.
ఇక వన్డేల్లో న్యూజిలాండ్ 121 పాయింట్లతో టాప్లో నిలవగా.. ఆస్ట్రేలియా 118, టీమిండియా 115 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు ఒక స్థానం కిందకు పడిపోయింది. బంగ్లాదేశ్పై 3-0తో సిరీస్ గెలవడం కివీస్కు టాప్ ర్యాంక్ దక్కేలా చేసింది. ఇంగ్లండ్(115) ఫోర్త్ ప్లేస్కు పడిపోయింది.