రాంచీ: టెస్టు మ్యాచ్ల్లో టీమిండియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. బ్యాట్స్మన్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ను 3-0తో భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 132/8తో నాలుగో రోజు ఇన్నింగ్స్ను ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు ఓవర్లలో ఒక పరుగు చేసి 133 పరుగులకే ఆలౌటైంది.
India vs South Africa: సిరీస్ క్లీన్స్వీప్.. చరిత్ర సృష్టించిన టీమిండియా !!
ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన భారత్.. 5 విజయాలతో 240 పాయింట్లు సాధించింది. భారత్కు దరిదాపున కూడా మరో జట్టు లేదు. కనీసం 100 పాయింట్లు ఉన్న జట్టు లేకపోవడం గమనార్హం. రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్, శ్రీలంక జట్లు.. చెరో 60 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి.
యాషెష్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టు మ్యాచ్లు ఆడినా.. చెరో ఒక విజయం సాధించాయి. చెరో ఒక మ్యాచ్ ఓడగా.. ఒకటి డ్రా అయింది. దీంతో ఆసీస్, ఇంగ్లండ్ జట్లు పాయింట్ల పట్టికలో 56 పాయింట్లతో నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి. యాషెష్ అనంతరం ఈ రెండు జట్లు మళ్లీ టెస్ట్ సిరీస్ ఆడలేదు. వెస్టిండీస్, సౌతాఫ్రికా ఇంకా ఖాతా తెరవలేదు. ఈ రెండు జట్లు భారత్ చేతిలోనే క్లీన్స్వీప్ అయ్యాయి. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు మాత్రం టెస్టు చాంపియన్షిప్ మ్యాచ్లను ఇంకా ఆడలేదు.
గత ఏడేళ్ల నుంచి సొంతగడపై టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. దక్షిణాఫ్రికాపై క్లీన్స్వీప్తో హోమ్ సిరీస్ను వరుసగా గెలవడం ఇది 11వ సారి. 2012-13లో చివరిసారి ఇంగ్లండ్ చేతిలో టీమిండియా హోమ్ టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత భారత్కు ఎదురులేకుండా పోయింది. మరోవైపు దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ 10 టెస్టులు ఆడగా.. అందులో ఏడు విజయాల్ని నమోదు చేసింది. దాంతో సఫారీలపై కోహ్లీ విజయాల శాతం 70గా నమోదైంది.