దంబుల్లా వేదికగా మంగళవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండ్ షోతో సత్తాచాటింది. 82 పరుగుల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ విజయంతో మహిళల ఆసియాకప్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్థాన్ కూడా సెమీస్కు చేరింది. గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో సెమీస్లో తలపడుతుంది.
బంగ్లాదేశ్ లేదా థాయిలాండ్తో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసం సృష్టించింది. హేమలత (47; 42 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది.

ఓపెనర్లు షెపాలీ, హేమలత తొలి వికెట్కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 14 ఓవర్లో వీరిద్దరు 122 పరుగులు చేశారు. ఆది నుంచే షెఫాలీ దూకుడుగా ఆడగా, హేమలత నిలకడగా ఆడింది. దీంతో భారత్ పవర్ప్లేలో 50 పరుగులు చేసింది. కాగా, పవర్ప్లే అనంతరం హేమలత కూడా గేర్ మార్చడంతో పరుగులు పోటెత్తాయి. 11 ఓవర్లకే టీమిండియా 100 పరుగుల మార్క్ను అందుకుంది.
ఈ క్రమంలో షెఫాలీ 26 బంతుల్లో అర్ధశతకం సాధించింది. అయితే వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో హేమలత పెవిలియన్కు చేరింది. కాసేపటికే షెపాలీ కూడా వెనుదిరిగింది. వన్డౌన్లో వచ్చిన సంజన (10; 12 బంతుల్లో, 1 ఫోర్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. దీంతో స్కోరు వేగం తగ్గింది. అయితే ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 5 ఫోర్లు) చెలరేగింది. నేపాల్ బౌలర్లలో సీతా రంగా రెండు వికెట్లు, కబితా జోషి ఒక వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. సీతా రాణా (18; 22 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి తలో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్లో నేపాల్ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేకపోయింది. మూడో వికెట్కు ఇందు (14; 18 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి సీతా నెలకొల్పిన 22 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. కాగా, శుక్రవారం భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.