
హైదరాబాద్: టీ20ల్లో ప్రపంచ రికార్డును టీమిండియా తృటిలో చేజార్చుకుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించేందుకు కేవల నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా( 263) జట్టు పేరిట ఉంది.. గతేడాది శ్రీలంకపైనే ఆస్ట్రేలియా అత్యధిక టీ20 స్కోరును నమోదు చేసింది.
అయితే ఇప్పుడు అదే జట్టుపై భారత్ అత్యధిక స్కోరుని నమోదు చేస్ అవకాశం వచ్చినా దానిని చేజార్చుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు పరుగుల వరద పారించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కుల చూపించాడు.
23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 101 పరుగులను రోహిత్ శర్మ సాధించాడు. టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.. 43 బంతులకు 118 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా వేసిన 13వ ఓవర్లో తొలి మూడు బంతులను సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన రోహిత్ ఆ తర్వాతి బంతిని కూడా బౌండరికి తరలించే ప్రయత్నంలో ధనంజయకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీని సాధించాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే జట్టు స్కోరు 243 పరుగుల వద్ద ఉండగా కేఎల్ రాహుల్(89) రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఆపై హార్దిక్ పాండ్యా మూడు బంతులు ఆడి ఒక ఫోర్, ఒక సిక్సర్తో 10 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే భారత్ జట్టు తన అత్యధిక అంతర్జాతీయ టీ20 స్కోరును నమోదు చేసింది. అంతకుముందు టీమిండియా అత్యధిక టీ20 స్కోరు 244/4 కాగా, దానిని ఈ మ్యాచ్లో సవరించింది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్ల పరంగా చూస్తే లంకతో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది.
2007లో కెన్యాపై శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. శుక్రవారం హోల్కార్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో శ్రీలంకపై భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సీరిస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తో సిరీస్ను కైవసం చేసుకుంది.