India Playing XI: టీమిండియా నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ను ప్రారంభించనుంది. 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడానికి ఈ సిరీస్ భారత్కు చాలా కీలకం. తాజా సమాచారం ప్రకారం.. ఇండియా-ఏ తరఫున దక్షిణాఫ్రికా-ఏపై అద్భుత ప్రదర్శన చేసిన ధ్రువ్ జురేల్కు చోటు దక్కనుంది. ధ్రువ్ జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ప్లేయింగ్ ఎలెవన్లో ఆడనున్నాడు. మెల్బోర్న్ హీరోగా పేరొందిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ధ్రువ్ జురేల్ను తీసుకునే అవకాశం ఉంది. జురేల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.
ధ్రువ్ జురేల్కు బంపరాఫర్
ఇటీవలి కాలంలో ఇండియా-ఏ తరఫున ధ్రువ్ జురేల్ చూపిన అసాధారణ ప్రదర్శన ఆయనకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కేలా చేసింది. జురేల్ మెరుపు ఫామ్ కారణంగా సెలెక్టర్లు అతడిని విస్మరించలేకపోయారు. జురేల్ దేశవాళీ సీజన్ ఆరంభం నుంచి ఆడిన చివరి ఎనిమిది ఫస్ట్క్లాస్ ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ, 40+ స్కోరు సాధించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా-ఏపై వరుసగా 132, 127 (నాటౌట్)* వంటి భారీ స్కోర్లు చేయడం అతడికి తుది జట్టులో బెర్త్ కన్ఫర్మ్ చేసింది.

నితీష్ రెడ్డిని తప్పించడానికి కారణం
మెల్బోర్న్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు తప్పించబడే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం భారత పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండటం వల్ల, అతని మీడియం పేస్ బౌలింగ్ నైపుణ్యం అంతగా అవసరం లేదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఓ బీసీసీఐ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. "జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడే అవకాశం ఉంది. అతని కోసం రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి నం. 3, కానీ ఆ స్థానంలో గత టెస్ట్లో అర్ధ సెంచరీ చేసిన సాయి సుదర్శన్ను కొనసాగించాలనేది మేనేజ్మెంట్ ఉద్దేశం. మరొక స్థానం నితీష్ కుమార్ రెడ్డిది. అయితే ఈ భారత పరిస్థితుల్లో అతని బౌలింగ్ నైపుణ్యం అంతగా అవసరం ఉండదని భావించి, నితీష్ కంటే అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్లో ఉన్న జురేల్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అతను నం.6లో బ్యాటింగ్ చేస్తాడు." అని వెల్లడించారు.
రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకొని తిరిగి వికెట్ కీపర్గా జట్టులోకి రావడంతో జురేల్ కేవలం బ్యాట్స్మన్గా జట్టులోకి వస్తున్నాడు. ఇది భారత టెస్ట్ క్రికెట్లో ఇద్దరు వికెట్ కీపర్లు ఒకేసారి స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడటం అరుదైన సందర్భం.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్కు భారత ప్లేయింగ్ XI (అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (WK), ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.