India Playing XI Vs Namibia: టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా.. తన తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఓ దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత ఇన్నింగ్స్(84*)తో ఆదుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. సూపర్-8 దిశగా అడుగులు వేయాలంటే ఈ మ్యాచ్లో గెలుపు భారత్కు ఎంతో కీలకం.
యార్కర్ కింగ్ ఈజ్ బ్యాక్
బౌలింగ్లో భారీ మార్పు వైరల్ ఫీవర్ కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. నమీబియాతో మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి రావడం టీమిండియా బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇస్తుంది. అయితే బుమ్రా జట్టులోకి వస్తే పేస్ విభాగంలో ఒకరిని తప్పించక తప్పదు. గత మ్యాచ్లో 3 వికెట్లతో మెరిసిన మహ్మద్ సిరాజ్ను పక్కన పెడతారా లేదా లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ చూపే అర్ష్దీప్ సింగ్ను బెంచ్కు పరిమితం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరాజ్పై వేటు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే?
వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు ఈ మ్యాచ్లోనూ నిరాశ తప్పేలా లేదు. తొలి మ్యాచ్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలమైనప్పటికీ.. జట్టు యాజమాన్యం వారికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ స్థానాలు సుస్థిరంగా ఉండటంతో సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. జట్టు సమతూకం దెబ్బతినకుండా ఉండేందుకు సంజూ శాంసన్ను మరోసారి రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ పిచ్పై స్పిన్ మ్యాజిక్ ఉండబోతుందా?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ప్రస్తుతం జట్టులో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. అవసరమైతే కుల్దీప్ యాదవ్ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో రింకూ సింగ్ను కొనసాగిస్తే.. కుల్దీప్ మరోసారి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుతో కలిసే అవకాశం ఉండటం మేనేజ్మెంట్కు తీపి కష్టాలను తెచ్చిపెడుతోంది.
నమీబియాతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.