సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ను సమం చేసి, అఫ్గానిస్థాన్ను 3-0తో చిత్తుచేసిన రోహిత్ సేన మరో సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్తో స్వదేశంలో అయిదు టెస్టుల సిరీస్ను ఆడనుంది. ఉప్పల్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే భారత్లో భారత్ను ఓడించాలంటే ఏ జట్టుకైనా కష్టతరమే. పుష్కరకాలం నుంచి టీమిండియాకు తిరుగులేదు. కానీ ఆఖరిగా మన జట్టు ఓడింది ఇంగ్లాండ్ చేతిలోనే. ఈ నేపథ్యంలో రోహిత్సేన ఫేవరేట్ అయినప్పటికీ సిరీస్పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
మరోవైపు ఇంగ్లాండ్ బాజ్బాల్ విధానం భారత్లోని స్పిన్ పిచ్లపై ఎలా పనిచేస్తుందని క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే ఇంగ్లాండ్ ఈ సారి తెలివిగా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు ఆరంభానికి ఒక్క రోజు ముందే తుదిజట్టును ప్రకటించింది. ఒకే ఒక్క పేసర్తో, ముగ్గురు స్పిన్నర్లతో ఆడనుంది. 1962 తర్వాత ఒక పేసర్తో బరిలోకి దిగడం ఇంగ్లాండ్కు ఇదే ప్రథమం.

అయితే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమవ్వడంతో భారత జట్టు కూర్పు గురించే అందరి ఆలోచన. స్టార్ క్రికెటర్ కోహ్లి స్థానంలో ఎవరొస్తారనేది అసలు ప్రశ్న. గతంలో మాదిరిగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. అయితే కోహ్లి ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిన్లో అతడు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడు. దీంతో శ్రేయస్ నాలుగో స్థానం దాదాపు ఖరారైనట్లే.
ఇక కేఎల్ రాహుల్ అయిదో స్థానంలో క్రీజులోకి వస్తాడు. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ తుదిజట్టులో దాదాపుగా ఉంటాడు. ధ్రువ్ జురెల్ కూడా వికెట్ కీపర్గా అందుబాటులో ఉన్నప్పటికీ భరత్కే అవకాశం దక్కనుంది. ఆరో స్థానంలో భరత్, ఏడు, ఎనిమిది స్థానాల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నారు. అయితే మూడో స్పిన్నర్గా జట్టులో చోటు కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అక్షర్ బ్యాటుతోనూ రాణించే సత్తా ఉండటంతో అతడి వైపు టీమిండియా యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇద్దరు పేసర్లుగా బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగనున్నారు.

టీమిండియా తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ (దూరం), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ , రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్