న్యూజిల్యాండ్తో తొలి వన్డే ఆడే జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్కు అవకాశం దక్కడం అభిమానులకు షాకిచ్చింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్లో తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
శ్రీలంక సిరీస్లో చేసినట్లే లైట్స్లో బౌలింగ్ చేసి, లక్ష్యాన్ని కాపాడుకోవడానికే తాము ప్రయత్నిస్తామని చెప్పాడు. పిచ్ బాగుందని, కొంత డ్రైగా ఉందని రోహిత్ చెప్పాడు. 'లైట్స్లో బౌలింగ్ చేస్తూ కూడా స్కోర్ను డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. శ్రీలంకపై కూడా ఇలాగే చేశాం. జట్టులో అందరూ నూటికి నూరు శాతం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు' అని అన్నాడు. ఈ సిరీస్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ ఆడటం లేదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ల స్థానంలో ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ వివరించాడు.
కివీస్ సారధి టామ్ లాథమ్ కూడా తాము ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నట్లు చెప్పాడు. తాము ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు. పాకిస్తాన్పై మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన జోరులో ఉన్న ఆ జట్టు.. భారత్లో కూడా అలాంటి ఫలితమే ఆశిస్తోందన్నాడు. వన్డే వరల్డ్ కప్ ఉన్న సంవత్సరంలో భారత్లో ఆడటం తమకు చాలా కీలకమని చెప్పాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్