సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధించాలనే 31 ఏళ్ల టీమిండియా కల ఈసారి కూడా నెరవేరలేకపోయింది. తొలి టెస్టులో కనీస పోటీ ఇవ్వకుండా మూడు రోజుల్లోనే రోహిత్ సేన ఓటమిని అంగీకరించింది. ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే రెండో టెస్టులో అయినా విజయం సాధించాలని టీమిండియా కసిగా సాధన చేస్తోంది. సిరీస్ను 1-1తో సమం చేయాలని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తోంది.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చేసిన పొరపాటులను సరిదిద్దుకునేందుకు రోహిత్ సేన పక్కా ప్లాన్తో రెండో టెస్టులోకి బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (101, 4), విరాట్ కోహ్లి (38, 76) మినహా మిగిలిన అందరూ బ్యాట్లెత్తేశారు. సఫారీ పేస్ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీస్లో కఠోర సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లి భారీ షాట్లతో ప్రాక్టీస్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ బౌన్సర్లతో సాధన చేశాడు.

అయితే కోహ్లి, రాహుల్ టీమిండియాకు కాస్త భరోసా ఇస్తున్నా మిగిలిన వారి నుంచి సహకారం లభించట్లేదు. రోహిత్ శర్శ, యశస్వీ జైశ్వాల్, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అజింక్య రహానె, పుజారా జట్టులోకి తీసుకురావాలని డిమాండ్స్ వచ్చాయి. కాగా, రెండో టెస్టులో విజయం సాధించాలంటే యువ ప్లేయర్లతో పాటు కెప్టెన్ రోహిత్ కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది.
ప్రసిధ్ కృష్ణ X ముకేశ్ కుమార్:మరోవైపు బౌలింగ్లో బుమ్రా మినహా ఎవరూ రాణించట్లేదు. షమి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా టీమిండియా బెంచ్ బలంతో కూడా విజయం సాధించింది. కానీ సఫారీ గడ్డపై పరిస్థితి భిన్నంగా ఉంది. బుమ్రాకు సిరాజ్ కాస్త సహకారం ఇస్తున్నా, పూర్తిస్థాయి సామర్థ్యంతో బౌలింగ్ చేయట్లేదు. కొత్త కుర్రాడు ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ముకేశ్ కుమార్ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే శార్దూల్ ఠాకూర్కు మరో ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది.
కెప్టెన్సీలో రోహిత్ దూకుడు పెంచాలి:ఇక, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోసం రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. అశ్విన్ నాణ్యమైన టాప్ బౌలర్ అయినా ఏడో స్థానంలో విలువైన పరుగులు చేయగలిగే జడేజా వైపే రోహిత్, రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపనున్నారు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది.
తొలి టెస్టులో సెషన్ ప్రారంభంలో ప్రధాన పేసర్లు కాకుండా ప్రసిధ్, శార్దూల్తో బౌలింగ్ చేయించిన వ్యూహంపై మాజీలు మండిపడ్డారు. అది ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశంగా మారిందన్నారు. అంతేగాక తొలి టెస్టులో బౌలర్లకు మద్దతుగా ఫీల్డర్లు నుంచి ఎలాంటి ప్రోత్సాహం దక్కలేదు. సూర్యుడి ఎఫెక్ట్కు అందరూ నీరసంగా కనిపించారు. కానీ సఫారీ గడ్డపై సౌతాఫ్రికాను ఓడించాలంటే కెప్టెన్ రోహిత్ జట్టులో జోష్ నింపాల్సి ఉంది.
భారత తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్
భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముఖేష్ కుమార్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్.