వెస్టిండీస్తో తొలి టెస్టు ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ మొదలవనుంది. ఈ క్రమంలో ఎవరికి జట్టులో చోటివ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనేది పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై టీమిండియా మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ స్పందించాడు. జట్టులో తెలుగు కీపర్ శ్రీకర్ భరత్కు చోటివ్వాలని భజ్జీ చెప్పాడు. అలాగే దేశవాళీల్లో చక్కగా రాణించిన జయదేవ్ ఉనద్కత్ను కూడా ఆడించాలన్నాడు.
భజ్జీ చెప్పిన జట్టులో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరికీ చోటు దక్కలేదు. తన యూట్యూబ్ ఛానెల్లో ఈ విషయంపై మాట్లాడిన భజ్జీ.. 'నన్నడిగితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఎప్పట్లాగే ఓపెనింగ్ చేయాలి. యశస్వి జైస్వాల్ను మూడో స్థానంలో ఆడించాలి. చాలా మంది యశస్వితో ఓపెనింగ్ చేయించాలి అంటున్నారు. కానీ గిల్ ఓపెనర్గా తన స్థానం పదిలం చేసుకున్నాడు. కాబట్టి అతన్ని అక్కడే కొనసాగించాలి' అని హర్భజన్ చెప్పాడు.

యశస్వి తనకు అవకాశం దక్కితే మంచి స్కోర్లు చేయాలని ఆశిస్తున్నట్లు భజ్జీ తెలిపాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడని, ఐదో స్థానంలో అజింక్య రహానే ఉంటాడని స్పష్టం చేశాడు. విండీస్లో కోహ్లీ రికార్డు అంత గొప్పగా లేదు. అతను ఆరు టెస్టుల్లో 35.61 సగటుతో కేవలం 463 పరుగులే చేశాడు. అదే రహానే సూపర్ రికార్డు మెయింటైన్ చేశాడు. అతను ఆరు టెస్టుల్లో 102.80 సగటుతో 514 పరుగులు చేశాడు.
'ఇక ఆరో స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడు. ఏడో నెంబర్లో కేఎస్ భరత్ లేతా అశ్విన్ ఆడతారు. ఒకవేళ అశ్విన్ను ముందుగా పంపితే భరత్ 8వ స్థానంలో ఆడతాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ ఉంటాడు. దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన జయదేవ్ ఉనద్కత్కు ఈ మ్యాచ్లో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ఇక చివరి స్థానంలో ముఖేష్ కుమార్ను తీసుకోవాలి' అని భజ్జీ సూచించాడు.
హర్భజన్ సెలెక్షన్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్