
టాపార్డర్లో మార్పులు లేవా?
టీమిండియా బ్యాటింగ్ టాపార్డర్లో దాదాపుగా మార్పులు ఉండవనే తెలుస్తోంది. ఒకవేళం విరాట్ కోహ్లీ తనంతట తానే రంజీ ట్రోఫీ ఆడేందుకు వెళ్తే తప్ప టీమిండియా టాపార్డర్లో మార్పులు ఉండవు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా వస్తారు. ఒకవేళ కోహ్లీ కనుక తప్పుకుంటే రజత్ పటీదార్కు జట్టులో చోటు దక్కుతుంది. లేదంటే రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ ముగ్గురూ మూడో వన్డే కూడా ఆడతారు. వీళ్లు ముగ్గురూ మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో వీరిని మార్చాలని టీమిండియా అనుకోవడం లేదు. అయితే కివీస్ సిరీస్లో కోహ్లీ ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే.

మిడిలార్డర్ నుంచి ప్రమోషన్?
కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు మరో అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. వన్డే ఫార్మాట్లో సూర్య పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. జట్టు మాత్రం అతనికే మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. ఇక ఐదో స్థానంలో వచ్చే ఇషాన్ కిషన్కు మిడిలార్డర్లో ఆట అలవాటు చేయాలని టీమిండియా ఆలోచన. కానీ కోహ్లీ కనుక ఆడకుంటే ఇషాన్ను ఓపెనర్గా పంపి, గిల్ను మూడో స్థానంలో కూడా పంపే అవకాశం ఉంది.

బౌలింగ్ ఛేంజ్ గ్యారంటీ!
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉన్నా, లేకున్నా.. బౌలింగ్ విభాగంలో మాత్రం తప్పకుండా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రెండో వన్డేలో కివీస్ పతనాన్ని శాసించిన మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ను దృష్టిలో ఉంచుకొని షమీని మూడో వన్డే ఆడించకూడదని నిర్ణయించింది. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్ను ఆడించనుంది. అలాగే హార్దిక్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ/రజత్ పటీదార్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్


Click it and Unblock the Notifications












