ఆసియా కప్ టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్లో భారత్ను ఢీకొట్టేందుకు శ్రీలంక రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మాట్లాడుతూ తమ టీం సరైన సమయానికి ఫామ్ అందుకుంటోందని చాలా ధీమాగా ఉన్నాడు. పాక్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఈ టీం.. భారత్పై కూడా అలాంటి ప్రదర్శనే చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది.
అదే సమయంలో బంగ్లాపై ఓటమితో కాన్ఫిడెన్స్ దెబ్బతిన్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ ముందు తాము కూడా ఫామ్ అందుకున్నామని చాటి చెప్పాలని అనుకుంటోంది. అయితే బంగ్లాపై ప్రధాన ప్లేయర్లు అందరికీ విశ్రాంతి ఇచ్చిన భారత్.. శ్రీలంకపై మళ్లీ ఫుల్ బలంతో బరిలో దిగనుంది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా భారత్ ఫేవరెట్ అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఈ మ్యాచ్కు టీమిండియా ఎదుర్కొంటున్న ఏకైక సమస్య అక్షర్ పటేల్. బంగ్లాదేశ్తో మ్యాచులో గాయపడిన అతను ఆసియా కప్ ఫైనల్ ఆడటం అనుమానంగా ఉంది. స్పిన్నర్లు మంచి ప్రభావం చూపుతున్న ప్రేమదాస స్టేడియంలో అక్షర్ లేకపోవడం భారత్కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను శ్రీలంక పిలిపించారు.
జడేజా, కుల్దీప్తోపాటు జట్టులో మరో స్పిన్నర్ కావాలని అనుకుంటే.. వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లలో ఒకరినే ఆడించి, శ్రేయాస్ను తీసుకుంటారా? లేక వాళ్లిద్దరినే కొనసాగిస్తారా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో అయితే అయ్యర్కు విశ్రాంతి ఇవ్వడమే మెడికల్ టీం ఎజెండా అని సమాచారం.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా