టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీలంకపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయింది. అనంతరం కాస్త విరామం తీసుకున్న భారత్ మరో సిరీస్కు సిద్ధమైంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది.
భారత్కు బంగ్లాదేశ్ కఠిన ప్రత్యర్థి కానప్పటికీ.. స్పిన్కు అనుకూలించే చెపాక్ వేదికగా తొలి టెస్టు జరగనుండటంతో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టు ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది. ఇటీవల లంక చేతిలో వన్డే సిరీస్ ఓటమికి కారణం.. ప్రత్యర్థి స్పిన్నర్లను మన బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం. దీంతో బంగ్లానే తేలికగా తీసుకోకూడదని జట్టు యాజమాన్యం భావిస్తుంది. అంతేగాక పాకిస్థాన్పై టెస్టు సిరీస్ గెలిచిన కొత్త ఉత్సాహంతో బంగ్లా బరిలోకి దిగుతోంది.

అయితే విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రావడంతో తుదిజట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంగ్లండ్ సిరీస్లో ఆకట్టుకున్న సర్ఫరాజ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంది. ఇక తొలిసారి టీమిండియాకు ఎంపికైన యశ్ దయాల్ అరంగేట్రం కోసం ఎదురుచూడాల్సి ఉంది. బంగ్లాతో తొలి టెస్టులో బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు అందుకోనున్నారు. దీంతో దయాల్తో పాటు ఆకాశ్ దీప్కు కూడా చోటు దక్కని పరిస్థితి.
కాగా, కోచ్ గంభీర్-కెప్టెన్ రోహిత్కు స్పిన్నర్ల ఎంపిక విషయంలో తలనొప్పి ఎదురుకానుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తుదిజట్టులో ఉండటం ఖాయమే. ఇక అసలు సమస్య.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లలో ఒకరిని ఎంపిక చేసుకోవడం. అయితే దులీప్ ట్రోఫీలో బ్యాటుతోనూ సత్తాచాటిన అక్షర్ను ఎంచుకునే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ భారత్ ఆడే తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.