
ధోనీ లేకుండా తొలిసారి
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి పేరుంది. అలాంటి ధోనీ లేకుండా భారత జట్టు చాలా కాలంగా ఎలాంటి నాకౌట్ మ్యాచ్ ఆడలేదు. సరిగ్గా చెప్తే గడిచిన 19 సంవత్సరాలలో ధోనీ లేకుండా ఏ ఐసీసీ ప్రపంచకప్లో (అది వన్డే అయినా, టీ20 వరల్డ్ కప్ అయినా) భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోలేదు. మళ్లీ ఇదిగో ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగాా జరుగుతున్న టోర్నీలో సెమీఫైనల్స్ చేరింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 11సార్లు నాకౌట్ మ్యాచులు ఆడిన ధోనీ.. వాటిలో పదింట్లో జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించాడు.

కెప్టెన్గా తిరుగులేని రికార్డు
టీమిండియా సారధిగా మహేంద్ర సింగ్ ధోనీకి తిరుగులేని రికార్డు ఉంది. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో భారత జట్టును నెంబర్ వన్గా నిలిపిన ఘనత ధోనీదే. అలాగే భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. కేవలం కెప్టెన్గానే కాదు.. బ్యాటింగ్లో, వికెట్ కీపింగ్లో కూడా భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.

తొలి టీ20 ప్రపంచకప్ విజేత
మొట్టమొదటి సారి టీ20 ప్రపంచకప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినప్పుడు.. ఒక యువకుడికి జట్టు పగ్గాలు అందించాలని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే సీనియర్ల అండదండలతో ధోనీకి ఈ అవకాశం దక్కింది. ఆ టోర్నీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు ట్రోఫీ ముద్దాడింది. ఆ తర్వాత 2011లో మరోసారి తన కెప్టెన్సీ ప్రతిభ చూపిన ధోనీ వన్డే వరల్డ్ కప్ను కూడా జట్టుకు అందించాడు.


Click it and Unblock the Notifications












