ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్:
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. 18న ఇంగ్లండ్తో (7:30 pm), 20న ఆస్ట్రేలియాతో (3:30 pm) భారత జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో 18న ఇంగ్లండ్తో ఆడే భారత తుది ఓసారి పరిశీలిద్దాం.
ఇషాన్ కిషన్కు అవకాశం:
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా.. రాహుల్ దుమ్ములేపాడు. పరుగుల వరద పారిస్తూ కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అయితే పంత్ ఐపీఎల్ 2021లో విఫలమయిన నేపథ్యంలో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇషాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2021లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు. ఒకవేళ రిషబ్ ఉంటే పాండ్యా బదులుగా కూడా కిషన్ ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
అశ్విన్, చహర్కు నిరాశే:
ఆల్రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్ 2021లో ఇరగదీసారు. ముఖ్యంగా శార్దూల్ చెన్నై తరఫున 21 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కీలక సమయంలో మ్యాచును మలుపుతిప్పాడు. బీసీసీఐ ముందుగా ప్రకటించిన భారత జట్టులో శార్దూల్ లేదన్న విషయం తెలిసిందే. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. దాంతో ఆర్ అశ్విన్, రాహుల్ చహర్కు నిరాశే ఎదురుకానుంది. పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు చోటు దక్కనుంది.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్/హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.