
టాప్-3పైనే భారం
మూడో టెస్టులో తప్ప ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చారు. క్రీజులో కుదురుకునే వరకు ఓపిగ్గా ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చారు. లార్డ్స్ టెస్టులో ఈ ఇద్దరూ 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో మాత్రం విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
అయితే కీలకమైన నాలుగో టెస్టులో ఈ ఓపెనింగ్ జోడి మంచి ఆరంభం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఇటీవలి కాలంలో ఫామ్ కొల్పోయిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్మన్ చేతేశ్వర్ పుజారా రెండో టెస్ట్ ద్వారా గాడిలో పడి.. మూడో టెస్టులో ఆ ఫామ్ కొనసాగించాడు. తృటిలో సెంచరీ కోల్పోయాడు. దీంతో పుజారా మరోసారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పూజిపై నమ్మకంగా ఉన్నాడు.

రహానే డౌటే
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయం వచ్చింది. అతడు సెంచరీ చేయాలని ఫాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే రెండో టెస్టులో పర్వాలేదనిపించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. మూడో టెస్టులో మళ్లీ విఫలమయ్యాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ ఉంది.
ఈ స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు జట్టులో చోటు కల్పించాలని అందరూ అంటున్నారు. సూర్యతో పాటుగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారి కూడా పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికైనా అవకాశం దక్కొచ్చు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రహానేను తప్పించే సాహసం చేస్తాడో లేదో చూడాలి. మూడో టెస్ట్ అనంతరం రొటేషన్ పాలసీ గురించి మాట్లాడిన కోహ్లీ.. కఠిన నిర్ణయాలు తీసుకోనున్నాడని తెలుస్తోందో. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

జడేజా ఫిట్.. విహారి డౌటే:
మూడో టెస్టులో గాయపడిన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా.. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించాడు. నిన్నటి వరకు జడేజా ఆడడం అనుమానమే అని వార్తలు రాగా.. బుధవారం జడ్డు ఫిట్ అని టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దాంతో ఆల్రౌండర్ కోటాలో జడేజా ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్కు కూడా సహకరింస్తుంది. దాంతో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు జతగా జడ్డు ఆడనున్నాడు. జడేజా బ్యటింగ్ చేయగల సామర్థ్యం ఉండడం కూడా అతడికి చోటు దక్కేలా కనిపిస్తోంది. దాంతో తెలుగు ప్లేయర్ హనుమ విహారి చోటు కష్టంగానే మారింది. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పేస్ కోటాలో ఆడనున్నారు.

ఇషాంత్ ఔట్
ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సి ఉంటుందని కెప్టెన్ సూచించాడు. మొదటి టెస్టులో ఇషాంత్ శర్మ ఆడలేదు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను మొత్తం 56 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో అతనికి ఐదు వికెట్లు లభించాయి. మూడో టెస్ట్ మ్యాచ్లో ఇషాంత్ 22 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మరోవైపు చీలమండ గాయం, కండరాల ఒత్తిడి కారణంగా ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి ఇప్పటివరకు జరిగిన మూడవ లేదా నాల్గవ స్పెల్ సమయంలో ఇషాంత్ అంత ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడనుంది.
ఇషాంత్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రావడం ఖాయం అయింది. యాష్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. ఈ సిరీసుకు ముందు కౌంటీ క్రికెట్ ఆడి సత్తాచాటాడు. ఆ ఫామ్ నాలుగో టెస్టులో కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక పేస్ కోటాలో మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ ఆడనున్నారు. ఈ త్రయం బాగా రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే/మయాంక్ అగర్వాల్/సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హనుమ విహారి/శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.


Click it and Unblock the Notifications












