
కోల్కత: భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఇంకా బోణీ కొట్టట్లేదు. టీమిండియాతో ఇప్పటికే టీ20 సిరీస్ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. సిరీస్ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇది. టీ20 ఫార్మట్ కేప్టెన్గా హిట్మ్యాన్కు ఇదే తొలి సిరీస్. దాన్ని విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు.. భారత్లో పర్యటిస్తోంది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లను ఆడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసిపోయాయి. సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక కానుంది. ఇప్పుడున్న ఫామ్ చూస్తోంటే.. కివీస్పై కనికరం లేకుండా మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ను కూడా టీమిండియా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్కు వైట్ వాష్ తప్పకపోవచ్చు.
మంచి దూకుడు మీద ఉన్న రోహిత్ సేనకు షాక్ ఇచ్చే సమాచారం ఇది. టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. రూల్డ్ అవుట్ అయ్యాడు. గాయం వల్ల ఆయన మూడో టీ20 మ్యాచ్కు దూరం కానున్నాడు. తుదిజట్టులో ఆయనకు చోటు దక్కడం అనుమానమే. ఈ మూడో టీ20 మ్యాచ్ మొదలయ్యేది ఆదివారం సాయంత్రం 7 గంటలకు. అప్పటివరకూ సిరాజ్ గాయం నుంచి కోలుకోలేకపోవచ్చని తెలుస్తోంది.
జైపూర్లో ముగిసిన తొలి టీ20 మ్యాచ్లో సిరాజ్ గాయపడ్డాడు. బ్యాటర్ ఆడిన షాట్ నేరుగా అతని ఎడమ అర చేతిని తాకింది. నొప్పితో ఫీల్డ్లోనే విలవిల్లాడాడతను. ఫిజియోథెరపిస్ట్ చికిత్స చేశాడు. ఆ తరువాత అతనికి స్కానింగ్ నిర్వహించారు డాక్టర్లు. అతని అరచెయ్యి వాచింది. స్కానింగ్ రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ఈ పరిణామాలతో మూడో టీ20లో సిరాజ్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. టెస్ట్ మ్యాచ్లకు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్.. రాంచీలో ముగిసిన రెండో టీ20 మ్యాచ్లో ఆడాడు. తన సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లను పడగొట్టాడు. డెరిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లను తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మూడో టీ20లో హర్షల్ పటేల్నే తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. సిరాజ్ అందుబాటులో లేకపోవడమంటూ జరిగితే- హర్షల్ తన కేరీర్లో మరో టీ20 మ్యాచ్ ఆడినట్టవుతుంది.
తుదిజట్టులో- కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కేప్టెన్), వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్కు చోటు దక్కొచ్చు.