'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ను టీమిండియా ఆటగాళ్లు కలిశారు. న్యూజిల్యాండ్తో జరిగే తొలి వన్డే కోసం హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు నగరంలో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ తదితరులు జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. వీళ్లంతా ఎన్టీఆర్తో కలిసిన దిగిన ఫొటోను ట్విట్టర్ యూజర్లు తెగ షేర్ చేస్తున్నారు.
ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కివీస్పై కూడా అదే జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది. అయితే చివరగా ఈ రెండు జట్లు న్యూజిల్యాండ్లో వన్డే సిరీస్ ఆడాయి. ఆ సిరీస్ను కివీస్ జట్టే నెగ్గింది. ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ చేయాలని న్యూజిల్యాండ్ భావిస్తోంది. ఈ రెండు జట్లు తొలి వన్డేలో బుధవారం తలపడతాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. భారత మిడిలార్డర్లో కీలకమైన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం కాలిఫోర్నియా వెళ్లిన తను.. అది ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగొచ్చాడు. ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు.. నాటు..' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అలాగే బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్ర విభాగంలో క్రిటిక్స్ చాయిస్ అవార్డు కూడా దక్కింది. ఆ సినీ వేడుక ముగించుకున్న ఎన్టీఆర్ మళ్లీ స్వదేశానికి వచ్చారు.