బెంగుళూరు: టీమిండియా జింబాబ్వే పర్యటన ఖరారైంది. వచ్చే నెలలో టీమిండియా మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లు ఆడేందుకు జింబాబ్వే రానుందని జింబాబ్వే క్రికెట్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. బంగ్లా పర్యటనలో భాగంగా బుధవారం నుంచి టెస్టు మ్యాచ్ ఆడుతుంది. టెస్టు మ్యాచ్ అనంతరం మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్లో భారత పర్యటన జూన్ 24తో ముగుస్తుంది.

అనంతరం జులై 7న టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ కెప్టెన్, జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ అలెస్టర్ క్యాంప్బెల్ తెలిపారు. జింబాబ్వేలో భారత్ పర్యటన జులై 7 నుంచి 20తో ముగుస్తుందని చెప్పారు.
ఈ పర్యటనలో జింబాబ్వే భారత్తో మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లు ఆడనుందని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన మ్యాచ్ తేదీలను ఈ వారాంతంలో ప్రకటిస్తామని అన్నారు. చివరిసారిగా టీమిండియా 2013లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.