పాకిస్తాన్పై అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరు కొనసాగిస్తూ శ్రీలంకను కూడా ఓడించింది. లోస్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, బుమ్రా బంతితో ఆకట్టుకున్నారు. దీంతో శ్రీలంకపై భారత జట్టు ఘనవిజయం సాధించి, ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఫైనల్లో భారత్తో తలపడే జట్టు ఏదో ఇంకా తేలలేదు.
అయితే ఫ్యాన్స్ మాత్రం మరోసారి భారత్, పాక్ మ్యాచ్ చూడాలని అనుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్లో ఈ రెండు టీమ్స్ తలపడాలని కోరుకుంటున్నారు. అది జరగాలంటే గురువారం జరిగే మ్యాచ్లో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించాలి. సూపర్-4లో శ్రీలంక, పాకిస్తాన్ రెండు టీమ్స్ ఒక్కో విజయం సాధించాయి. రెండు టీమ్స్ బంగ్లాదేశ్ను ఓడించాయి.

అయితే నెట్ రన్ రేట్ ప్రకారం చూసుకుంటే శ్రీలంక కొంత మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే శ్రీలంకను భారత్ భారీ తేడాతో ఓడించాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. శ్రీలంకను 41 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అంతకుముందు పాకిస్తాన్పై ఏకంగా 228 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయాలతో భారత జట్టు మెరుగైన రన్రేటు సాధించింది. అలాగే రెండు విజయాలతో ఫైనల్ బెర్తు కూడా ఖాయం చేసుకుంది. ఇక పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచులో విజేత దాదాపుగా ఆసియా కప్ ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఇలాంటి కీలక సమయంలో నసీం షా వంటి పేసర్ ఈ సిరీస్కు దూరమవడం పాక్కు ఎదురు దెబ్బే అని చెప్పాలి.

అదే సమయంలో కొలంబోలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంకకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. స్పిన్కు సహకరించే పిచ్పై లంక బౌలర్లు చెలరేగుతున్నారు. వరుసపెట్టి తమ ప్రత్యర్థులను ఆలౌట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాక్ జాగ్రత్తగా ఆడకపోతే ఇంటిముఖం పట్టడం ఖాయమనే చెప్పాలి.
అదే పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం కనుక సత్తాకు తగ్గట్లు రాణిస్తే.. లంక ముందు భారీ స్కోరు ఉంచడం చాలా సులభం. బ్యాటింగ్ బలహీనంగా ఉన్న శ్రీలంకకు భారీ స్కోరును ఛేజ్ చేయడం కష్టమనే చెప్పాలి. ఫైనల్లో భారత్ను ఢీకొట్టాలని అనుకుంటే పాక్ జట్టు గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.