ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచులు చూసేందుకు వరుణుడు కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు. గ్రూప్ దశలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ను వరుణుడు ముంచేయడంతో ఫలితం లేకుండానే ఆ మ్యాచ్ ముగిసింది. ఇక సూపర్-4 దశలో జరుగుతున్న మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను రిజర్వ్ డే అయినా సోమవారానికి వాయిదా వేశారు.
అయితే సోమవారం కూడా కొలంబోలో వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ్యాచ్ మొదలయ్యే సమయానికి 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఈ అవకాశం పెరుగుతూనే ఉంది. సాయంత్రానికి ఇది 80 శాతానికి పెరుగుతోంది. దీంతో రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ ఆసాంతం జరిగే సూచనలు కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే డీఎల్ఎస్ విధానంలో విజేతను నిర్ణయిస్తారు.

ఒకవేళ వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ కనీసం 20 ఓవర్లు కూడా జరగకపోతే.. ఈ మ్యాచ్ను కూడా అంపైర్లు రద్దు చేస్తారు. అంటే ఆసియా కప్లో రెండోసారి కూడా భారత్, పాక్ మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుందన్నమాట. ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా మంది బీసీసీఐ సెక్రటరీ జై షాను దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసియా కప్ను నాశనం చేశాడంటూ తిట్టిపోస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్ మధ్యలో ఉండగానే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం ఆగినట్లే ఆగి మళ్లీ మొదలైంది. ఇది తగ్గేలా కనిపించకపోవడంతో మ్యాచ్ను రిజర్వ్ డేలో కొనసాగించాలని అంపైర్లు నిర్ణయించారు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో బరిలో దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58) ఇద్దరూ కూడా అద్భుతంగా ఆడారు. పాక్ పేసర్లపై వీళ్లిద్దరూ ఎదురుదాడి చేయడంతో భారత్కు మంచి ఆరంభం దక్కింది. కానీ వరుస ఓవర్లలో వీళ్లిద్దర్నీ పెవిలియన్ చేర్చిన పాకిస్తాన్.. భారత్పై ఒత్తిడి పెంచింది.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరూ ఈ పనిలో ఉండగానే వర్షం మొదలైంది. వర్షం పెద్దది అవడంతో అంపైర్లు మ్యాచ్ ఆపేశారు. ఆ తర్వాత కాసేపు భారీ వర్షం పడటంతో మైదానంలో కొన్ని చోట్ల గ్రౌండ్ చిత్తడిగా తయారైంది.
దీన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. కానీ మళ్లీ భారీ వర్షం మొదలవడంతో ఇక మ్యాచ్ను ఆ రోజుకు ఆపేయాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు. రిజర్వ్ డే నాడు మిగతా మ్యాచ్ జరగనుంది. ఆ మరుసటి రోజునే భారత్, శ్రీలంక మ్యాచ్ ఉండటంతో.. రిజర్వ్ డే వల్ల భారత జట్టుకే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.