భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ వాయిదా పడింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్లో ఆ తర్వాత వర్షం పడే అవకాశం ఉండటంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇక మ్యాచ్ మొదలైన తర్వాత టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58) ఇద్దరూ కూడా అద్భుతంగా ఆడారు. పాక్ పేసర్లపై ఎదురుదాడికి దిగిన ఇద్దరూ కూడా ఆరంభంలో కొంత తడబడినా ఆ తర్వాత చెలరేగారు. దీంతో భారత్కు మంచి ఆరంభం దక్కింది. కానీ వరుస ఓవర్లలో వీళ్లిద్దర్నీ పెవిలియన్ చేర్చిన పాకిస్తాన్.. భారత్పై ఒత్తిడి పెంచింది.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరూ ఈ పనిలో ఉండగానే వర్షం మొదలైంది. వర్షం పెద్దది అయ్యేలా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ను ఆపేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో గ్రౌండ్ స్టాఫ్ వేగంగా కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేయడానికి ప్రయత్నించారు.
అయితే వాళ్లు పిచ్ను చేరుకునే సరికి వర్షం చాలా పెద్దది అయిపోయింది. దీంతో అందరూ వేగంగా రియాక్ట్ అయ్యి మైదానం మొత్తాన్ని కవర్స్తో కప్పేశారు. ఆ తర్వాత వర్షం ఆగినట్లే ఆగి మళ్లీ పెరిగింది. చివరకు వర్షం ఆగినా కూడా.. మైదానంలో కొన్ని చోట్ల చిత్తడిగా మారింది. దీంతో 7.30కు అంపైర్లు వచ్చి ఈ చిత్తడి ప్రాంతాలను పరిశీలించారు. ఆటగాళ్లకు వీటి వల్ల ప్రమాదం ఉండకూడదనేది వాళ్ల ఆలోచన.
ఈ క్రమంలోనే 8.30కు మరోసారి తనిఖీ చేస్తామని, అప్పటి వరకు ఈ చిత్తడి ప్రాంతాలను ఆరబెట్టాలని అంపైర్లు సూచించారు. గ్రౌండ్ స్టాఫ్ అదే పనిలో నిమగ్నమయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగితే రెండు జట్లు చెరో 34 ఓవర్ల మ్యాచ్ ఆడతాయని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా 8.30 గంటలకు మరోసారి వర్షం మొదలైంది. దీంతో మైదానంలో మరిన్ని ప్రాంతాలు చిత్తడిగా మారే ప్రమాదం ఉందని అంపైర్లు భావించారు.
ఈ క్రమంలో ఆ రోజుకు ఆట ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మ్యాచ్కు ఎటూ రిజర్వ్ డే ఉన్నందున.. ఈ మ్యాచ్ ఎక్కడ ఆగిందో, సోమవారం నాడు అక్కడి నుంచే మొదలవుతుంది. అయితే ఈ నిర్ణయం వల్ల భారత జట్టుకు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే సోమవారం నాడు పాక్తో ఆడే టీమిండియా.. ఆ మరుసటి రోజునే శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.