పాకిస్తాన్తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భారత జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58) ఇద్దరూ దూకుడుగా ఆడారు. దీంతో పాక్ బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. అయితే రోహిత్, గిల్ ఇద్దరూ వరుస ఓవర్లలో అవుటవడంతో టీమిండియాపై కొంత ఒత్తిడి పడింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో భారత జట్టు 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో ఉండగా వర్షం పడింది. ఆ తర్వాత వర్షం ఆగినా కూడా మైదానంలో కొన్ని చోట్ల చిత్తడిగా తయారవడంతో దాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ స్టాఫ్ ప్రయత్నించారు. ఇక మ్యాచ్ 9 గంటలకు మొదలవుతుందని అనుకుంటుండగా.. మరోసారి వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఇక సోమవారం మధ్యాహ్నం మ్యాచ్ కొనసాగుతుంది.

ఇలా వర్షం పడటం వల్ల పాకిస్తాన్కు చాలా మేలు జరిగిందని పాక్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. లేదంటే పాక్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకునే వాళ్లని చెప్పాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బాబర్ నిర్ణయం తప్పని మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే అర్థమైపోయింది. భారత ఓపెనర్లు ఇద్దరూ చెలరేగడంతోపాటు ప్రమాదకర పాక్ పేసర్ల పని పట్టారు.
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబో వచ్చిన అక్తర్.. ఇలాంటి 'తెలివైన నిర్ణయం' తీసుకున్నందుకు బాబర్కు చురకలేశాడు. అదే సమయంలో రిజర్వ్ డే నాడు మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నానని, పాకిస్తాన్ రాణిస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు. 'కొలంబోలో వర్షం చాలా క్రేజీ' అనే క్యాప్షన్తో తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో వీడియో షేర్ చేశాడీ 48 ఏళ్ల పేస్ లెజెండ్.
'ఈ మ్యాచ్ చూడటానికి ఇక్కడకు వచ్చా. భారత్, పాకిస్తాన్ రెండు జట్ల ఫ్యాన్స్ కూడా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వర్షం మనల్ని కాపాడేసింది. మొదటి మ్యాచ్లో భారత్ మన చేతుల్లో ఇరుక్కుపోయింది. అప్పుడు వర్షం కాపాడేసింది. ఇప్పుడు మనం వాళ్ల దగ్గర దొరికిపోయాం. మనల్ని కూడా వర్షం కాపాడేసింది నయం. మ్యాచ్ రిజర్వ్ డే రోజైనా ముగుస్తుందని ఆశిస్తున్నా. ఎంతైనా ముందు బౌలింగ్ చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నాం కదా' అంటూ బాబర్ను ట్రోల్ చేశాడు.