IND vs PAK: ఆసియా కప్ 2025లో దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోరు కేవలం క్రీడా మైదానంలో జరిగే యుద్ధం మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా బీసీసీఐ, పీసీబీ, ఐసీసీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కేవలం 10 సెకన్ల వాణిజ్య ప్రకటనకు కంపెనీలు రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నాయంటే.. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్, వాణిజ్య విలువ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రకటనల ద్వారా భారీ ఆదాయం
'ఎకనామిక్స్ టైమ్స్' నివేదిక ప్రకారం.. ఈరోజు జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రకటనకర్తలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రతి 10 సెకన్ల ప్రకటనకు కంపెనీలు రూ. 16 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. ఈ మ్యాచ్ ప్రసార హక్కులు సోనీ నెట్వర్క్స్కు ఉండటంతో, లైవ్ టెలికాస్ట్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో, లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్లో జరుగుతోంది. భారత్, పాకిస్తాన్, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కోట్లాది మంది అభిమానులు టీవీలు, మొబైల్లలో ఈ మ్యాచ్ను వీక్షిస్తారు. ఈ భారీ ప్రేక్షకుల సంఖ్య కారణంగానే ప్రకటనలకు ఇంత డిమాండ్ పెరిగింది.

టికెట్ల ద్వారా కోట్లల్లో ఆదాయం
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు టికెట్ల అమ్మకాల ద్వారా కూడా భారీ లాభాలు వస్తాయి. ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలు రూ.11,390 నుంచి రూ.12,589 వరకు ఉన్నాయి. గతంలో దుబాయ్లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ద్వారా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఆదాయం వస్తుందా అనేది ఆసక్తిగరంగా మారింది. అయితే ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని కొంతమంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల అభిమానుల్లో ఉత్సాహం తగ్గి టికెట్లు అమ్ముడుపోవడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మ్యాచ్ ప్రారంభం తర్వాతే తెలుస్తుంది.
మ్యాచ్ వివరాలు ఇలా..
భారత్, పాక్ జట్లు మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్తో ఆసియా కప్ టోర్నమెంట్కు మరింత ఉత్సాహం రానుంది. రెండు జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఈ మహా సంగ్రామం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.