ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాక్ పేసర్లను ఎదుర్కోవడంలో తడబడిన రోహిత్.. ఈ మ్యాచ్లో పాక్ పేస్ దళాన్ని చాలా సునాయాసంగా డీల్ చేశాడు. ముఖ్యంగా మంచి ఫామ్లో ఉన్న షహీన్ అఫ్రిదీకి ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. అతను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారీ సిక్సర్ బాదాడు.
కొత్త బంతితో ఎలాంటి ప్రత్యర్థికైనా ముచ్చెమటలు పోయించే షహీన్.. ఈ సిక్స్ దెబ్బకు తడబడ్డాడు. ఆ తర్వాత తన రిథమ్ కోల్పోయి చెత్త బంతులు వేశాడు. అతను గాడి తప్పిన ప్రతిసారీ రోహిత్, గిల్ ఇద్దరూ భారీ షాట్లు ఆడారు. దీంతో షహీన్ కొత్త బంతితో తన ప్రభావం చూపలేకపోయాడు. ఇక్కడే ఒక అరుదైన విషయం జరిగింది. షహీన్ వేసిన భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని సుతారమైన టైమింగ్తో రోహిత్ సిక్సర్గా మలిచాడు.

ఇలా ఇంతకుముందు ఎవరూ కూడా షహీన్ వేసిన తొలి ఓవర్లో సిక్సర్ బాదలేదు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ వంటి జట్లను కూడా తన పేస్తో వణికించే షహీన్కు ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరూ ఇవ్వలేదు. దీంతో షహీన్ వేసిన తొలి ఓవర్లో సిక్సర్ బాదిన మొట్టమొదటి బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇక ఆ తర్వాత కూడా రోహిత్, గిల్ ఇద్దరూ దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే.
అయితే ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్న కాసేపటికే పెవిలియన్ బాటపట్టారు. అప్పుడే గేరు మార్చిన రోహిత్ అవుటవడం వల్ల పాకిస్తాన్కు చాలా ఊరట లభించిందని, అతను చెత్త షాట్ ఆడి అవుటయ్యాడని మాజీలు అంటున్నారు. అలాంటి షాట్ ఆడి అవుటైనందుకు రోహిత్ కచ్చితంగా తనను తాను తిట్టుకుంటూ ఉండి ఉంటాడని గంభీర్ చెప్పాడు. సోమవారం నాడు రాహుల్, కోహ్లీ ఇన్నింగ్స్ ఎలా కొనసాగిస్తారనేది కీలకం కానుంది.