పాకిస్తాన్తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భారత్కు శుభారంభం దక్కింది. రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా షహీన్ అఫ్రిదీ, నసీం షా ఓవర్లను చాలా చక్కగా ఆడారు. ఆరంభంలో గిల్ కొంత తడబడినా ఆ తర్వాత తనదైన స్టైల్లో కట్ షాట్లు ఆడుతూ అలరించాడు.
ఇక వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తిచేసుకోవడంతో భారీ స్కోర్లు చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ వేసిన ఓవర్లో అయితే రోహిత్ చెలరేగాడు. వరుసగా రెండు సిక్సులు, ఫోర్ బాది షాదాబ్ను వణికించాడు. అయితే ఆ తర్వాత మళ్లీ బౌలింగ్కు వచ్చిన షాదాబ్ తెలివైన బౌలింగ్తో రోహిత్ను బుట్టలో వేసుకున్నాడు.

అతను వేసిన ఫ్లైటెడ్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ముందుకు వచ్చాడు. కానీ షాట్ను అతను పూర్తి చేయలేదు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి లాంగాఫ్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫహీమ్ అష్రాఫ్ వేగంగా రియాక్ట్ అయ్యి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాదాబ్ గర్జించాడు. రోహిత్ చాలా నిరాశగా ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ చేరాడు.
రోహిత్ అవుట్ అవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కొత్త బ్యాటర్ రావడంతో మరోసారి పేసర్లను బాబర్ ఆజమ్ నమ్ముకున్నాడు. వెంటనే షహీన్ అఫ్రిదీని రంగంలోకి దించాడు. అయితే అతని బౌలింగ్లో గిల్ తడబడ్డాడు. షహీన్ వేసిన స్లో బాల్ను అంచనా వేయడంలో విఫలమైన అతను.. కవర్ డ్రైవ్ చేయబోయాడు. దీంతో బ్యాట్ పైభాగంలో తగిలిన బంతి నేరుగా కవర్స్ ఫీల్డర్ వైపు వెళ్లింది.
అక్కడ ఉన్న షాదాబ్ ఖాన్ చక్కగా క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో గిల్ కూడా భారీ స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ లెంగ్త్లో వేసిన బంతిని సాధారణంగా ఏ బ్యాటర్ కూడా డ్రైవ్ చేయడు. బంతి లెంగ్త్ మారడాన్ని గిల్ అంచనా వేయలేకపోవడం వల్లనే అతను అవుటయ్యాడు. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్లో కూడా గిల్ ఇదే తరహాలో అవుటవడం గమనార్హం. ఇలా ఇద్దరు సెట్ బ్యాటర్లను భారత్ వరుస ఓవర్లలో కోల్పోవడంతో పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.