కేవలం భారత్లోనే కాదు. మొత్తం క్రికెట్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. ఒక విధంగా క్రికెట్ ముఖచిత్రంలా మారాడీ ఢిల్లీ కుర్రాడు. అయితే ఎదిగే క్రమంలో తన క్రికెట్ ఐడల్ సచిన్ టెండూల్కర్ అని పలుమార్లు కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయాన్ని చెప్పాడీ మోడ్రన్ గ్రేట్.
తాజాగా స్టార్ స్పోర్ట్స్కు ఇంటర్వ్యూ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఆసక్తికర విషయం వెల్లడించాడు. కోహ్లీ తన కెరీర్ ఆరంభించనప్పుడు ఎంతోమంది మహామహులు క్రికెట్ ఆడుతున్నారు. వారందరితో కోహ్లీ కలిసి ఆడాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఎంతో మందికి ఆటోగ్రాఫ్లు ఇచ్చిన కోహ్లీ.. తన వద్ద కూడా ఒక స్పెషల్ ఆటోగ్రాఫ్ ఉందని తెలియజేశాడు.

'మా ఇంట్లో కేవలం ఒకే ఒక్క ఆటోగ్రాఫ్ జెర్సీ ఉంది. నేను తొలి సెంచరీ చేసినప్పుడు నా టెస్టు జెర్సీపై సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అదొక్కటే మా ఇంట్లో ఇప్పటికీ భద్రంగా ఉంది' అని కోహ్లీ వెల్లడించాడు. ఆ తర్వాత మరెన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ.. టెస్టుల్లో 29 శతకాలు సాధించాడు. గత నెలలో వెస్టిండీస్పై కూడా శతకంతో ఆకట్టుకున్నాడు.
ఇక వన్డేల్లో అయితే సచిన్ రికార్డులు ఒక్కొక్కటే బద్దలు కొడుతున్న కోహ్లీ.. ఓవరాల్గా 100 శతకాలు సాధించి, సచిన్ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టేందుకు ఒక్కో అడుగే ముందుకు వేస్తున్నాడు. గత రెండేళ్లలో ఫామ్ లేక తంటాలు పడిన అతను.. గతేడాది నెలరోజుల విశ్రాంతి తర్వాత రిఫ్రెష్ అయిన అతను.. మళ్లీ ప్రపంచ క్రికెట్ను ఏలడం మొదలు పెట్టాడు.
అవకాశం చిక్కిన ప్రతిసారీ భారీ ఇన్నింగ్సులు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కూడా ఉండటంతో అందరూ కూడా విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా మంది మాజీలు, నిపుణులు కూడా టీమిండియాకు ఈ వరల్డ్ కప్లో కోహ్లీ చాలా కీలకం అని చెప్పిన సంగతి తెలిసిందే.