పాకిస్తాన్తో టీమిండియా ఆడిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో కేఎల్ రాహుల్ చెలరేగాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. విరాట్ కోహ్లీతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే వర్షం వల్ల ఆదివారం నాడు మ్యాచ్ ఆగిపోయింది. అనంతరం రిజర్వ్ డే అయిన సోమవారం మొదలైన ఆటలో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గాయం నుంచి కోలుకొని ఆడుతున్న తొలి మ్యాచులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీతో కలిసి 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆసియా కప్లో భారత్ తరఫున ఇదే అత్యధిక పార్టనర్షిప్ కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్లో ఆడతానని రాహుల్కు ఏమాత్రం ఐడియా లేదట. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో మొదలవుతుంది అనగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని కలిశాడట.

అప్పటికి తను మ్యాచ్ ఆడనని గట్టిగా ఫిక్స్ అయిపోయిన రాహుల్.. తన బ్యాటు, తదితర వస్తువులు ఏవీ వెంట తెచ్చుకోలేదట. ఈ మ్యాచ్లో వాటర్ బాటిల్స్ అందించడమే తన పని అని రాహుల్ గట్టిగా ఫిక్స్ అయిపోయాడట. మ్యాచ్ అనంతరం ఇదే విషయం గురించి స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ వెల్లడించాడు. ద్రావిడ్ అలా చెప్పగానే షాకైపోయానని అన్నాడు.
'కరెక్ట్గా ఇంకో ఐదు నిమిషాల్లో మ్యాచ్ మొదలవుతుందనగా.. రాహుల్ భాయ్ వచ్చి నేను ఆడుతున్నానని చెప్పాడు. వాటర్ బాటిల్స్ అందించడమే ఈ మ్యాచ్లో నా పని అని అనుకున్నా. అందుకే బ్యాట్, కిట్ ఏమీ తెచ్చుకోలేదు. నా కెరీర్లో నేను ఇలా చాలా వింత అనుభవాలు ఎదుర్కొన్నా' అని చెప్పాడు. ఇలా సడెన్గా చెప్పడంతో టీం మేనేజర్ను హడావిడిగా హోటల్కు పంపించి తన వస్తువులన్నీ తెప్పించుకున్నాడట రాహుల్.
ఇక మైదానంలో దిగిన తర్వాత అతను ఎంతలా చెలరేగాడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాక్ స్పిన్నర్లకు రాహుల్ చుక్కలు చూపించాడు. క్రికెట్లో స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఆడాల్సిన అన్ని షాట్లనూ ఆడేశాడు. ఆ తర్వాత పేసర్లపైనా ప్రతాపం చూపించాడు. దీంతో పాక్ బౌలర్లు అతన్ని అవుట్ చేయలేక చేతులెత్తేశారు.