టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ విషయంలో మాజీ దిగ్గజం గౌతం గంభీర్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. కోహ్లీకి ఏవైనా అవార్డులు వచ్చినప్పుడు గంభీర్ చాలా క్రిటికల్గా మాట్లాడతాడు. ఇదంతా చూసిన వాళ్లు కోహ్లీ అంటే గంభీర్కు అసూయ అని అంటుంటారు. దానికితోడు ఐపీఎల్లో వీళ్లిద్దరికి పలుమార్లు గొడవలు జరిగాయి కూడా. దీంతో ఈ వదంతులు మరింత ఎక్కువగా నెట్టింట హల్చల్ చేస్తుంటాయి.
పాకిస్తాన్తో ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ నిర్మించి వన్డేల్లో తన 47వ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఆ తర్వాత భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా బంతితో అదరగొట్టాడు. పాక్ మిడిలార్డర్ను తుత్తునియలు చేసిన అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు.

ఈ క్రమంలో పాక్పై వన్డేలో ఐదు వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్గా కుల్దీప్ రికార్డు సృష్టించాడు. దీని గురించి మాట్లాడిన గంభీర్.. తానైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కచ్చితంగా కుల్దీప్కే ఇచ్చేవాడినన్నాడు. స్పిన్ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని పేరున్న పాక్ బ్యాటర్లను కుల్దీప్ ముప్పుతిప్పలు పెట్టాడని, అతనే గేమ్ ఛేంజర్ అని గంభీర్ అన్నాడు.
'నన్నడిగితే కుల్దీప్కు ఈ అవార్డు ఇస్తా. అంతకుమించి ఎవరికీ ఇవ్వకూడదు. విరాట్ సెంచరీ చేశాడు. కేఎల్ కూడా శతకం బాదాడు. రోహిత్, గిల్ చెరో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. కానీ ఇంతలా పేసర్లకు స్వింగ్ దొరుకుతున్న పిచ్పై ఎవరైనా సరే 8 ఓవర్లలో ఐదు వికెట్లు తీసుకుంటే.. అది కూడా స్పిన్ను బాగా ఆడే పాక్పై వికెట్లు తీస్తే వాళ్లే గేమ్ ఛేంజర్' అని గంభీర్ పేర్కొన్నాడు.

'ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ మీద ఇలాంటి ప్రదర్శన చేస్తే ఓకే.. ఎందుకంటే వాళ్లు స్పిన్ అంత బాగా ఆడలేరు. కానీ పాక్ అలా కాదు. ఈ ప్రదర్శన కచ్చితంగా ఆ బౌలర్ క్వాలిటీని తెలియజేస్తుంది. వరల్డ్ కప్లోకి వెళ్లే ముందు కుల్దీప్ రాణించడం భారత క్రికెట్కు చాలా ముఖ్యం. ఇప్పుడు భారత్ దగ్గర ఇద్దరు ఎటాకింగ్ పేసర్లు ఉన్నారు. వాళ్లకుతోడు కుల్దీప్.. ఈ ముగ్గురూ మ్యాచ్లో ఎలాంటి సమయంలో అయినా వికెట్లు తీసుకోగల సత్తా ఉన్న వాళ్లే' అని గంభీర్ మెచ్చుకున్నాడు.